ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి ప్రాణహాని ఉందని.. మిలిటెంట్లు కొందరు సీఎంను టార్గెట్ చేస్తున్నారని తమకు సమాచారం అందిందని మధ్యప్రదేశ్ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ పోలీస్ శాఖ నిఘా వ్యవస్థను పటిష్టం చేయబోతున్నట్లు తెలిపింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా సీఎంకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ పర్యటనకు సీఎం వెళ్తున్న క్రమంలో.. ఆ ప్రాంతంలో పలు చోట్ల నిఘా వ్యవస్థను కూడా పోలీసులు పటిష్టం చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే సీఎం కార్యాలయంతో పాటు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను ప్రభుత్వం మోహరించింది. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా కొద్ది రోజులే సమయం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు నగరంలో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ సరిహద్దు వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని.. దాదాపు 600 మంది మిలిటెంట్లు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 


ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్‌కి జెడ్ క్యాటగరీ సెక్యూరిటీని ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఆయనకు ఈ సెక్యూరిటీతో పాటు క్యూఆర్‌టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్) సేవలను కూడా అందించడం జరిగింది. ఆదిత్యనాథ్‌కి ఇలాంటి బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. ఆయనపై దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు టెర్రిరిస్టు సంఘాలు అనేకసార్లు ప్రకటించాయి. ఆదిత్యనాథ్ ప్రస్తుతం యూపీకి ముఖ్యమంత్రిగానే కాకుండా గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాని పూజారిగా కూడా సేవలందిస్తున్నారు.