PV Sindhu honoured with Padma Bhushan: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. బ్యాడ్మింటన్ రంగంలో ఆమె సేవలకు 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. 2015లో పీవీ సింధుకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం (నవంబర్ 8) 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దివంగత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సేవలను (Sushma Swaraj) స్మరించుకుంటూ కేంద్రం పద్మ విభూషన్ అవార్డును ప్రకటించగా.. సుష్మా స్వరాజ్ తరుపున ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ అవార్డును అందుకున్నారు. సుష్మా స్వరాజ్‌తో పాటు జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, విశ్వేశ్వరతీర్థ స్వామీజీలకు మరణానంతరం పద్మ విభూషణ్‌లను కేంద్రం ప్రకటించింది. హిందుస్తానీ క్లాసికల్ సింగర్ చనులాల్ మిశ్రా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.


ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా హాకీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణి రాంపాల్‌ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ, ఎయిర్ మార్షల్ డా.పద్మ బందోపాధ్యాయ్, ఐసీఎంఆర్ మాజీ చీఫ్ డా.రమణ్ గంగాఖేడ్కర్, నటి కంగనా రనౌత్ (Kangana Ranaut), మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌లు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.


2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి. అవార్డులు అందుకున్నవారిలో అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.