Rahul Gandhi on PM's announcement to repeal farm laws: నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించిన నేపథ్యంలో... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు. 'దేశ అన్నదాతలు తమ సత్యాగ్రహంతో అహంకారాన్ని మట్టికరిపించారు. అన్యాయంపై వారు సాధించిన విజయానికి అభినందనలు. జైహింద్, ఇది కిసాన్ జైహింద్..' అని ఆ వీడియోకి తన కామెంట్‌ను జత చేశారు. చాలామంది నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేసి రాహుల్ చెప్పిందే నిజమైందని అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ... ' రైతుల పోరాటాన్ని చూసి నేను గర్వపడుతున్నా. నా పూర్తి మద్దతు వారికి ఉంటుంది... ఇక ముందు కూడా వారికి అండగా నిలబడుతా. పంజాబ్‌ యాత్రలో రైతు సమస్యలను లేవనెత్తాను. నా మాటలు గుర్తుంచుకోండి.. కేంద్ర ప్రభుత్వం ఈ సాగు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదు.' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో రాహుల్ ఈ కామెంట్లు చేయగా... ఏడాది తిరగకముందే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం గమనార్హం.


గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం ఈ సాగు చట్టాలను (Agri Laws) తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ చట్టాలపై ఎంత వ్యతిరేకత, నిరసన వ్యక్తమైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. రైతు ప్రయోజనాల కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చామని చాలా సందర్భాల్లో గట్టిగా వాదించింది. కానీ రైతులు మాత్రం మొదటి నుంచి ఈ చట్టాలపై వ్యతిరేకత (Farmers Protest) వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా క్రమంగా కార్పోరేట్లకు ధారాదత్తం చేసేందుకే ఈ చట్టాలు తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. రైతులను ఒప్పించేందుకు కేంద్రం 11 దఫాలుగా వారితో చర్చలు జరిపినా సఫలం కాలేదు. చట్టాల రద్దుకే రైతులు పట్టుబడుతూ వచ్చారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్నారు. ఈ నవంబర్ 26తో రైతుల నిరసనలకు ఏడాది పూర్తవుతున్నందునా మరోసారి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 


 



Also Read: 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ


ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి రైతు చట్టాలపై వెనక్కి తగ్గింది. ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా ప్రకటించారు. అంతేకాదు రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. నిజానికి ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవే కానీ ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయామని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఆయన... వ్యవసాయ బడ్జెట్‌ను ఐదింతలు పెంచామని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook