తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 10వ తేదీన తేదీన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే. 'రైతు బంధు' కార్యక్రమం సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు 'రైతుబంధు' పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో సీఎం తెలిపారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయాలని, మంచి నీటి సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాస్ పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాల వారిగా పంపించాలని, ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో స్థానికంగా అందరికీ తెలపాలని,  రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు అధికారులు కార్యక్రమం జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని సీఎం అన్నారు.


గవర్నర్‌తో సీఎం భేటీ


రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 10వ తేదీన ప్రారంభయ్యే రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్.. గవర్నర్‌ను ఆహ్వానించారు. ఏదైనా ఒక జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను సీఎం కోరారు.