ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చిరకాల శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మిగిలిన చిన్న పార్టీలను కలుపుకొని  మహాకూటమి పేరుతో తెరపైకి వచ్చిన క్రమంలో తామూ ఎన్నికల బరిలోకి  దిగుతామని దళిత సంఘర్షణ సమితి ప్రకటించడం గమనార్హం. దళితులు ప్రభావితం చేయగల్గిన 50 స్థానాల్లో బరిలోకి దిగుతామని జాతీయ సమన్వయకర్త నల్లా రాధాకృష్ణ పేర్కొన్నట్లు ప్రముఖ మీడియాలో ప్రచురితమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇక కుదరవు


సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దళిత సంఘర్షణ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. తీరా దళిత ఓట్లతో గెలిచిన తర్వాత దళితుల సంక్షేమం కోసం ఏ ఒక్క పార్టీ కూడా పని చేయడం లేదని  విమర్శించారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితేనే తమ జాతి మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న  ఎన్నికల్లో 50 స్థానాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించారు. అక్టోబర్ 9న కాన్షీరామ్ వర్ధంతి రోజున తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.  బహుజనవాదంతో ముందుకు  వెళ్తున్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని రాధాకృష్ణ  పేర్కొన్నారు.


దళిత ఓటర్లు ఎటు వైపు  ?


తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే దళితుల ఓట్లు కీలకం. గత ఎన్నికల్లో ఈ సామాజికవర్గానికి చెందిన ఓట్లు కారణంగానే టీఆర్ఎస్ అధికారంలోకి రాగల్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి దళిత ఓటర్లు ఆకర్షించేందుకు  కేసీఆర్ అనేక పథకాలు ప్రకటిస్తూ ముందుకెళ్తున్నారు..మరోవైపు మహాకూటమి కూడా దళితుల సమస్యలనే ప్రధాన ఎజెండాగా దూసుకెళ్తోంది. ఇలా అధికార, ప్రతిపక్షాలు దళిత ఓట్లపైనే ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. దళితుల తమవైపే ఉన్నరని టీఆర్ఎస్ పార్టీ అంటుంటే ..లేద లేదు దళిత ఓట్లు తమకే పడతాయని మహాకూటమి చెబుతోంది. ఈ నేపథ్యంలో దళిత సంఘర్షణ సమితి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. తాజా ప్రకటనతో దళిత వర్గం ఎవరివైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.