Liquor sales on Dussehra festival 2021 in Telangana: హైదరాబాద్‌, : తెలంగాణలో దసరా పండగకు మద్యం ఏరులైపారింది. దసరా పండగ ఒక్కనాడే రాష్ట్రంలో రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గతంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సందర్భంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డును తలదన్నేలా దసరా పండగనాడు ఒక్క రోజే రూ. 200 కోట్ల విలువైన మద్యం సేల్ అయిందని ఎక్సైజ్ రికార్డులు చెబుతున్నాయి. దసరా పండగ (Dasara festival) సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 వ తేదీ వరకు ఐదు రోజు వ్యవధిలోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం చూస్తోంటే మందు బాబులకు దసరా పండగ కిక్కు ఎంత బాగా ఎక్కిందో ఇట్టే అర్థమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ జిల్లాల్లోనే అత్యధిక మొత్తంలో మద్యం అమ్మకాలు
దసరా పండగ సందర్భంగా జరిగిన మద్యం విక్రయాల్లో అత్యధిక వాటా రంగారెడ్డి జిల్లాదే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో రూ.58 కోట్లు, హైదరాబాద్‌లో రూ.42 కోట్ల మద్యం అమ్ముడుపోగా (Liquor sales in Hyderabad), కరీంనగర్‌ జిల్లాల్లో మూడు రోజుల్లోనే రూ.29 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో రూ.27 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. 


అక్టోబర్ ప్రారంభంతోనే బతుకమ్మ ఉత్సవాలు (Bathukamma festival), దసరా పండగ రావడంతో ఈ నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రూ.487 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో మందు బాబులు రూ. 2,623 కోట్ల విలువైన మద్యం తాగేశారని.. అలాగే ఈసారి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం రూ.3000 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు (Liquor sales) జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ (Telangana excise) అంచనా వేస్తోంది.