జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ భయంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రతి ఏడాది ఇదే నెలలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. బహుశా ఇది కూడా వారి భయానికి కారణం అయి ఉండవచ్చు. ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురవటం, చలి ఎక్కువగా ఉండటంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉంది. 


ఇప్పటికే హైదరాబాద్లో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో ప్రవేట్ క్లినిక్ లలో చికిత్స పొందుతున్నారు. అయినా నయం కాకపోవడంతో సర్కారు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే వారికి స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు సోకినట్లు నిర్థారణ అవుతోంది. ప్రస్తుతం నగరంలో ఈ రెండు వ్యాధులకు సంబంధించిన అనుమానిత లక్షణాలతో అనేక మంది కనిపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని నగరాన్ని శుభ్రం చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు.