హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమ కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి కేబినెట్‌లో వివిధ కారణాలతో పదవులు దక్కని కీలక నేతలకు ఈ కేబినెట్‌లో అవకాశం కల్పించడమే కాకుండా వారికి కీలక శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. నేడు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. 


సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి సంబంధిత అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ కొత్త గవర్నర్‌గా నేడు రాజ్‌భవన్‌కి రానున్న తమిళిసై సౌందరరాజన్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.