Court contempt notices to MLC Venkatramireddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు (High Court) కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సింగిల్ జడ్జి సిఫారసు చేసిన ఈ పిటిషన్‌పై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. రైతులు వరి విత్తనాలు వేయవద్దని... ఒకవేళ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా పట్టించుకోనని ఇటీవల వెంకట్రామిరెడ్డి (MLC Venkatramireddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైకోర్టు (Telangana High Court) ఆదేశాలపై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ... వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని బెంచ్‌కు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఇటీవలే సిద్దిపేట (Siddipet) కలెక్టర్ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడం... ఆ వెంటనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాలో చోటు దక్కించుకోవడం... ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి.


26 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వాల్లో పనిచేసిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చేస్తున్న అభివృద్ది పనుల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నానని కలెక్టర్ పదవికి రాజీనామా సందర్భంగా వెంకట్రామిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. వెంకట్రామిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నేతలెవరూ బరిలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైందని సోమవారం (నవంబర్ 22) రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం వారికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.


Also Read: Pre Wedding Photoshoot: గంటలో పెళ్లి.. జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోన్న పెళ్లి కూతురు


వెంకట్రామిరెడ్డిపై జగ్గారెడ్డి అవినీతి ఆరోపణలు : 


ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (MLA Jaggareddy) సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి పెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భారీ దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు. దోపిడీ డబ్బు భారీగా ఉన్నందునే టీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందన్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందరు ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook