హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరోకరు వాడీ వేడీగా విమర్శించుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మహాకూటమి పేరుతో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుబడుతూ టి కాంగ్రెస్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. హరీష్ రావు సంధించిన ప్రశ్నలు ఒక్కసారి పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* తెలంగాణకు అడ్డుతగిలిన టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు చెప్పగలరా ?


* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీడీపీ వైఖరి మార్చుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా ?


* గోదావరి,  కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా ?


*  సీలేరు హైడెల్ కేంద్రాన్ని తిరిగి తెలంగాణకు తిరిగి ఇప్పిస్తారా?


* తెలంగాణకు ఇబ్బంది కలగని రీతిలో పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా ?


* పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా ?


* పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బాబు తన వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా?


* కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వాపసు తీసుకున్నారా ? 


* తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో కృష్ణా జలాలను  ఇప్పిస్తామని చెప్పించగలరా?


*  మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు వైఖరి మారిందా ?


* నిజాం ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా ?


* ఏపీకి చెందిన ఉద్యోగులను తీసుకోవడానికి చంద్రబాబు బాబును ఒప్పుకున్నారా ?


* హైకోర్టు తో సహా మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా ?


ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను తెలంగాణ కాంగ్రెస్ నివృత్తి చేయాలని కోరారు. మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబుతో ఈ పన్నెండు అంశాలపై సంతకం పెట్టిస్తారా? అని ఈ సందర్భంగా  హరీష్ రావు ప్రశ్నించారు. తాజా లేఖపై కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.