మైదానంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇండియన్ క్రికెట్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఫస్ట్ ఇండియన్ రికార్డు వచ్చిచేరింది. ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డు కైవసం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే భారీగా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి కోహ్లీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో 930 పోస్టులు పోస్ట్ చేయగా.. ప్రపంచం నలుమూలల నుంచి కోహ్లీ అభిమానులు వాటిని లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ చేస్తున్నారు. దీంతో కోహ్లీ క్రేజ్ ఖండాంతరాలకు వ్యాపించింది. విరాట్ కోహ్లీకి 50 మిలియన్ ఫాలోవర్స్ ఉండటమే కాదు... 200 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న పోర్చుగల్‌కి చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు క్రిష్టియానో రోనాల్డో వంటి ఆటగాళ్లు కూడా కోహ్లీని ఫాలో అవుతున్నారు. 


విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత భారీ ఫాలోయింగ్ కలిగిన ప్రముఖుల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా 49.9 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 44.1 మిలియన్ ఫాలోవర్స్‌తో దీపికా పదుకునె మూడో స్థానంలో ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..