బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తీవ్ర రూపం దాలుస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నివర్ తుపాను ( Nivar Cyclone ) ప్రభావం తీవ్రమవుతోంది. ఊహించినదానికంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ( Tamilnadu ), పుదుచ్చేరి ( Puducheri ) తో పాటు ఏపీలోని సరిహద్దు జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 3 వందల కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుపాను ముందుకు కదులుతోంది. మరో 12 గంటల్లో నివర్ సైక్లోన్ అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన ఈ తుపాను  ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కరైకల్-మహాబలిపురం వద్ద తీరం దాటనుంది.  తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.  


మహాబలిపురం ( Mahabalipuram )మధ్య తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉండి..అదే తీవ్రతతో  చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ ( IMD ) అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లా  అధికారులు అప్రమత్తమయ్యారు.  మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా జేఎన్టీయూ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షల్ని వాయిదా వేశారు. నివర్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.  పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. Also read: AP: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, భారీ వర్షాలు