ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో విజయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో బోణీ కొట్టింది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు. కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్ యుజువేంద్ర చహల్ (Yuzvendra Chahal) తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు విజయాన్ని అందించాడు. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 121 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. విజయానికి 5 ఓవర్లలో 43 పరుగులు అవసరం. ఆ సమయంలో నమ్మకస్తుడు చహల్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతి అందించాడు. కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ రెండు వికెట్లు పడగొట్టాడు చహల్. 



మొదటగా క్రీజులో కుదురుకున్న జానీ బెయిర్ స్టో (61, 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆపై ఆల్ రౌండర్ విజయ్ శంకర్ క్రీజులోకి వచ్చాడు. 3D ప్లేయర్‌ విజయ్ శంకర్‌కు గూగ్లీలతో ఆహ్వానం పలకాలని సీనియర్ ప్లేయర్లు ఏబీ డివిలియర్స్, కోహ్లీ సలహా ఇచ్చారు. వెంటనే చేతికి మట్టి రాసుకుని అద్భుతమైన గూగ్లీని సంధించాడు. క్లీన్ బౌల్డ్ అయి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు విజయ్ శంకర్. ఏబీ, కోహ్లీ సలహాతో పెద్దగా ఇబ్బంది లేకుండా విజయ్‌ని ఔట్ చేయగలిగానని, రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ చహల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.



కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. 10 పరగుల తేడాతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. 



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe