ఎయిర్ ఫోర్స్ అధికారిణిగా నటిస్తోన్న శ్రీదేవి కూతురు

"దడక్" చిత్రంతో బాలీవుడ్‌లో ఇప్పటికే తన గ్లామర్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న "తక్త్ " చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Last Updated : Sep 14, 2018, 11:34 PM IST
ఎయిర్ ఫోర్స్ అధికారిణిగా నటిస్తోన్న శ్రీదేవి కూతురు

"దడక్" చిత్రంతో బాలీవుడ్‌లో ఇప్పటికే తన గ్లామర్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న "తక్త్ " చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత కరణ్ జోహార్ జాన్విని మరో చిత్రంలో నటింపజేయడానికి ఒప్పించారని కూడా వార్తలొస్తున్నాయి. తన తదుపరి చిత్రంలో జాన్వి.. ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని కూడా సమాచారం. ప్రముఖ ఎయిర్ ఫోర్స్ అధికారిణి గుంజన్ సక్సేనా పాత్రలో శ్రీదేవి కుమార్తె నటించనున్నారని తెలుస్తోంది.

భారతదేశానికి చెందిన తొలి మహిళా కాంబాట్ ఏవియేటర్ గుంజన్ సక్సేనా కావడం విశేషం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కూడా ఆపరేషన్స్ నిర్వహించిన ఘనత ఆమెది. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో జాన్వి కనిపించనుందని అంటున్నారు. ఒక రకంగా ఈ చిత్రాన్ని గుంజన్ సక్సేనా బయోపిక్ అని కూడా చెప్పుకోవచ్చని పలు పత్రికలు వార్తలు రాశాయి. అయితే ఈ కాన్సెప్ట్ ఫైనలైజ్ అవ్వలేదని.. ఇంకా కథా చర్చల దగ్గరే ప్రాజెక్టు ఉందని.. ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందో తెలియదని కూడా పలువురు చలనచిత్ర ప్రముఖులు అంటున్నారు. అలాగే నిర్మాతల నుండి ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

జాన్వి కపూర్ నటించిన తొలి చిత్రం "దడక్" నిర్మాతలకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టింది. 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. షాహిద్ కపూర్ కజిన్ ఇషాన్ కట్టర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మరాఠీ చిత్రం "సైరత్"కు రీమేక్ అయిన "దడక్" చిత్రానికి జీ స్టూడియోస్‌తో పాటు ధర్మా ప్రొడక్షన్స్ కూడా నిర్మాణ సంస్థలుగా వ్యవహరించాయి. శశాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 
 

Trending News