ఒకే ధరకు పెట్రోల్, డీజిల్ సాధ్యమేనా?: కేంద్రాన్ని అడిగిన సుప్రీంకోర్టు

గూడ్స్ వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనాలకు (ప్రైవేటు కార్లు) పెట్రోలు, డీజిల్‌లను ఒకే ధరకు అమ్మడం సాధ్యమవుతుందా? కాదా? అని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Last Updated : Jul 14, 2018, 11:47 AM IST
ఒకే ధరకు పెట్రోల్, డీజిల్ సాధ్యమేనా?: కేంద్రాన్ని అడిగిన సుప్రీంకోర్టు

గూడ్స్ వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనాలకు (ప్రైవేటు కార్ల వంటివి) పెట్రోలు, డీజిల్‌లను ఒకే ధరకు అమ్మడం సాధ్యమవుతుందా? కాదా? అని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డీజిల్‌ వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందంటూ పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (ఈపీసీఏ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానం దీనిపై అధ్యయనం చేయాలని సూచించింది.

శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం పెరుగుతుండటంపై దాఖలైన కేసు విచారిస్తున్న సమయంలో జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని పైవిధంగా ప్రశ్నించింది. డీజిల్ వాడకాన్ని ఎలా తగ్గించగలమో ఆలోచించాలని తెలిపింది. ‘‘జర్మనీ డీజిల్‌ వాహనాలను నిషేధిస్తోంది. మిగితా అనేక ఐరోపా దేశాలు కూడా ఇదే తరహాలో నడుస్తున్నాయి. మనం కూడా మారాలి. డీజిల్‌ వాడకాన్ని ఎలా తగ్గించగలమో ఆలోచించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
 
అయితే వాహనతయారీ దారుల సంఘం (ఎస్‌ఐఏఎం- సియామ్‌) మాత్రం సమాన ధరలు సాధ్యం కాకపోవచ్చని.. వినియోగం, నాణ్యత, ప్రాసెసింగ్ లాంటి అనేక ఖర్చులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వాహనాల రూపకల్పన మారుతోందని.. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో బీఎస్‌-6 గ్రేడ్ ఇంధన వాహనాలు వచ్చే ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి వస్తాయని.. దీంతో డీజిల్‌ వాహనాలతో ఎదురయ్యే సమస్యలు తీరిపోనున్నాయని సియామ్‌ వివరించింది. 2020 కల్లా అనేక నగరాల్లో కూడా  ఈ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంది.

Trending News