న్యూఢిల్లీ: ముంబై-అహ్మెదాబాద్ మధ్య సేవలు అందిస్తోన్న బుల్లెట్ ట్రైన్కు పేరు పెట్టండి, అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఓ మస్కట్ ని రూపొందించండి అంటూ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్కు పేరు పెట్టి, చక్కటి ఆకర్షణీయమైన మస్కట్ను రూపొందించి ఆకర్షణీయమైన బహుమతులు గెల్చుకునే అవకాశం పొందండి అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనదల్చినవారు www.mygov.in వెబ్సైట్ ద్వారా మార్చి 25లోగా మీ సూచనలు, సలహాలు మాకు అందేలా పంపండి అని ఈ ప్రకటనను విడుదల చేసిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) స్పష్టంచేసింది.
పోటీల చివరిలో బుల్లెట్ ట్రైన్కు ఆకర్షణీయమైన పేరు, మస్కట్ డిజైన్ రూపొందించిన వారి పేర్లను ఎంపిక చేసి వారికి నగదు బహుమతితో పాటు పోటీలో పాల్గొన్నట్టుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సైతం అందించనున్నట్టు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ వెల్లడించింది. బుల్లెట్ ట్రైన్ పేరు, మస్కట్ రెండూ కూడా ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో పాటు సంస్థ ప్రత్యేకతలు తెలియజెప్పేలా ఉండాలని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ తేల్చిచెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? వెంటనే మీరు కూడా ఈ పోటీల్లో పాల్గొనండి.. నగదు బహుమతితోపాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని సొంతం చేసుకోండి.