మాండ్య: ప్రముఖ సినీ నటి, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బుధవారం ఆమె కర్ణాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త అంబరీష్ కన్నడనాట నటుడిగా పేరు తెచ్చుకోవడమేకాకుండా కర్ణాటక రాజకీయాల్లోనూ సుపరిచితుడనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందిన ఘనత అంబరీష్ సొంతం. కాంగ్రెస్ పార్టీ నేతగా ఎదిగిన ఆయన చనిపోవడానికి ముందు కొంత కాలం నుంచి పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదనే అసంతృప్తితో వుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీపై అసంతృప్తితో వున్న అంబరీష్ భార్య అయిన సుమలత మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధమయ్యారు.
మాండ్య నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికొస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ-జేడీ(ఎస్) పార్టీలు కూటమిగా ఏర్పడినందున ఇక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కూటమి తరపున అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు.