యూపీలో షాక్: 40 మందికి హెచ్ఐవీ

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో జరిగిన ఈ ఘటనతో జనం ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Last Updated : Feb 8, 2018, 10:54 AM IST
యూపీలో షాక్: 40 మందికి హెచ్ఐవీ

ఓ నకిలీ డాక్టర్ చేసిన నిర్వాకం కారణంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. ఉత్తరప్రదేశ్‌‌లోని ఉన్నావోలో జరిగిన ఈ ఘటనతో జనం ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఒకే సూదితో (సిరంజి) ఇంజక్షన్ చేసి తమ జీవితాలను సర్వనాశనం చేశారంటూ బాధితులు వాపోతున్నారు. తమలా మరెవరికీ కాకూడదని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. యుపీలోని ఉన్నావోలోని బంగార్‌మౌ ప్రాంతంలో ఇటీవలే ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో 500 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో 40 మందికి హెచ్‌ఐవీ ఉందని తేలింది. ఒకే ప్రాంతంలో ఇన్ని కేసులా? అని అనుమానం వచ్చి ఆరోగ్యశాఖ అధికారులు ఓ కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు.

కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామంలో రాజేంద్ర కుమార్‌ అనే నకిలీ డాక్టర్‌ ఉన్నాడు. అతడు తక్కువ ఫీజుకే వైద్యం చేస్తాడు. అతడు తన వద్దకు వచ్చే పేషెంట్లకు ఒకే సూదితో ఇంజక్షన్‌ చేసేవాడు. దీని వల్లే వీరందరికీ హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడించారు. దీంతో రాజేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌‌కు తీసుకెళ్లారు. ఇంకా ఎవరైనా ఈ నకిలీ డాక్టర్ నిర్వాకం వలన రోగాలకు గురైనవారు ఉన్నారా అని పోలీసులు విచారణ చేపట్టారు. 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x