అమరావతి: చంద్రబాబు భద్రత విషయంలో టీడీపీ శ్రేణుల ఆందోళన నేథప్యంలో జగన్ సర్కార్ స్పందించింది. వరద విజువల్స్ కోసం డ్రోన్ ను ప్రయోగించామని జలవనరుల శాఖ ప్రకటన విడదల చేసింది. రాబోయే రోజుల్లో కృష్ణా నదికి ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వచ్చే అవకాశముందని ...ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఓ అవగాహనకు వచ్చేందుకే విజువల్స్ తీయాలని నిర్ణయించామని పేర్కొంది.
ఈ క్రమంలో కృష్ణా నది పరివాహనక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు విజువల్స్ తీయాల్సిందిగా అధికారులను కోరినట్లు తెలిపింది. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం కూడా కరకట్టకు సమీపంలో ఉండటం వల్ల అక్కడ కూడా పరిస్థితిని సమీక్షిచాల్సి వచ్చిందని.. అందుకే అక్కడ డ్రోన్ ప్రయోగించాల్సి వచ్చిందని జలవనరులశాఖ ఇలా వివరణ ఇచ్చింది.
ఈ రోజు ఉదయం ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసం వద్ద ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించడంపై చంద్రబాబు సెక్యూరిటీ అభ్యంతరం తెలిపింది. తన భద్రతను ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు... హై సెక్యూరిటీ జోన్ లో అసలు డ్రోన్ ను ఎలా ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తమ అధినేతకు భద్రత కరువైందని టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ ఈ మేరకు స్పందించింది.