ఢిల్లీ: విష జ్వరాల నియంత్రణ కోసం దోమలపై దండయాత్రకు ఢిల్లీ సర్కార్ నడుంబిగించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దస్ హఫ్తే - దస్ బజే - దస్ మినిట్ (పది వారాలు-పది గంటలకు- పది నిమిషాల పాటు) అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ప్రజలు ప్రతివారం ఒక పదినిమిషాలు కేటాయించి తమ ఇళ్లను, చుట్టపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మెగా క్యాంపెయిన్లో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
కేజ్రీవాల్ ఇంటి నుంచే ప్రారంభం
దోమలపై యుద్ధం ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ చేపట్టిన అవగాహన కార్యక్రమం వచ్చే నవంబరు 15 వరకు ప్రతి ఆదివారం నిర్వహిస్తామని సీఎంవో కార్యాలయం తెలిపింది. కాగా ఈ మెగా క్యాంపెయిన్ ముందుగా తన ఇంటి నుంచే కేజ్రీవాల్ ప్రారంభించారు. ఆదివారం తన ఇంట్లో, పరిసరాల్లో నీరు ఎక్కడైనా వుందా ? అంటూ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్రేజీవాల్ మాట్లాడుతూ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో తనిఖీచేశామని ఎక్కడా నిల్వ నీరు కనిపించలేదన్నారు. ప్రజలు కూడా తమ తమ ఇళ్లతో పాటు పరిసరాల్లోనూ నీరు నిలిచి ఉండ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లోకానీ, పరిసరాల్లోనీరు నిల్వఉంకుండా, మురికి నీరు లేకుండా చూసుకుంటే తమ కుటుంబాలని డెంగ్యూ, చికున్గున్యా నుంచి కాపాడుకున్నట్టేనని కేజ్రీవాల్ తెలిపారు.
రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కార్యక్రమం
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతుంది. ఈ వ్యాధులకు కారణం దోమలే కారణమౌతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోనూ ఇలాంటి విష జ్వరాల కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో నేరుగా ప్రభుత్వమే చొరవ తీసుకుని విషజ్వరాలపై కేజ్రీవాల సర్కార్ యుద్ధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు ఇలాంటి చర్య పూనుకుంది. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ఈ మెగా క్యాంపెయిన్ దేశంలోని అనేక రాష్ట్రాలకు స్పూర్తిగా నిలుస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ డెంగ్యూ లాంటి జ్వరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం ఇక్కడా అవసరమనే వాయిస్ గట్టిగా వినిపిస్తోంది