చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంపై ఢిల్లీ వేదికగా నిరసనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పయనమౌతున్న చంద్రబాబు... కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఢిల్లీ వేదికగా సీఎం నిరసన తెలపనున్నారు. ఈవీఎంల విషయంలో తాము ఎన్నిస్లారు విజ్ఞప్తులు చేసినా స్పందించని ఈసీ.....వైసీపీ కోరిన వెంటనే రీపోలింగ్ ఆదేశాలు ఇవ్వడం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
మహా కూటమి భేటీ పై మంతనాలు..
మే 23న ఎన్నికల ఫలితాల రోజు మహాకూటమి (మహా ఘట్ బంథన్ ) సభ్యులు భేటీ కావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే..దీని గురించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు పార్టీలకు చెందిన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఎల్జేడీ అధినేత శరద్యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యే ఛాన్స్ ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.