వెండితెరపై "సీఎం" రూటే.. సెపరేటు..!

             

Last Updated : Oct 26, 2017, 06:58 PM IST
వెండితెరపై "సీఎం" రూటే.. సెపరేటు..!

ఒక సాధారణ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. ఒక్కో నటుడు ఒక్కో శైలిలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. కొందరు నటులైతే స్వర్గీయ ఎంజీఆర్, ఎన్టీఆర్, వైఎస్సార్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. తెలుగులో జగపతిబాబు, రానా లాంటి నటులు ఇప్పటికే అధినేత, లీడర్ లాంటి సినిమాల్లో సీఎం పాత్రలో నటించారు. ఈ  క్రమంలో మరో ప్రముఖ హీరో కూడా త్వరలో ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించనున్నారు... అతనెవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు. కొరటాల శివ దర్శకత్వంలో త్వరతో తెరకెక్కనున్న ఓ సినిమాలో మహేష్  సీఎం పాత్రలో కనిపిస్తున్నారని టాక్. ఈ క్రమంలో ఇంత వరకు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయిన కొందరు నటుల గురించి తెలుసుకుందాం.

1997లో తమిళంలో వచ్చిన "ఇరువర్" చిత్రంలో నటుడు మోహన్ లాల్ స్వర్గీయ ఎంజీఆర్‌ని పోలిన పాత్రలో ఒదిగిపోయారు. కథాపరంగా ఆ పాత్ర పేరు ఆనందన్ అయినప్పటికీ.. వాస్తవంగా అది ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రనే పోలి ఉందని విమర్శకుల అభిప్రాయం. ఇదే చిత్రంలో కరుణానిధిని పోలిన తమిళసెల్వన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించి మెప్పించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కాసుల వర్షాన్ని కూడా అలాగే కురిపించింది. జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. అయితే ఒక బయోగ్రఫిక్ ఫిల్మ్‌లా కాకుండా.. ఒక సాధారణ వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం మరొకటి ఉంది.  అదే 1999లో అర్జున్, మనీషా కొయిరాలా జంటగా నటించిన "ముదల్ వన్" చిత్రం. ఇదే చిత్రం తెలుగులో "ఒకే ఒక్కడు" పేరుతో విడుదలైంది. ఒక జర్నలిస్టు ఒక సీఎంని సవాలు చేసి ఒక్క రోజు సీఎంగా మారి ఎలా సమస్యల పరిష్కారానికి పూనుకుంటాడో ఈ చిత్రంలో చూడవచ్చు. ఇదే చిత్రం "నాయక్" పేరుతో హిందీలోకి రీమేక్ అయ్యింది. అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిందీలో కూడా విజయాన్ని నమోదు చేసింది.

2005లో వచ్చిన "శంఖారావం" అనే తెలుగు చిత్రం కూడా ఒక రాష్ట్ర సీఎం చుట్టూ తిరుగుతుంది. సీఎం, ప్రతిపక్షనాయకుడితో కలిసి మారువేషంలో ఒక మారుమూల గ్రామానికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడం ఈ చిత్ర కథాంశం. ఇందులో సీఎం పాత్రలో అనంత్ నాగ్ నటించగా, ప్రతిపక్షనాయకుడి పాత్రను శరత్ బాబు పోషించారు. 

అలాగే 2006లో మలయాళంలో వచ్చిన "రాష్ట్రం" చిత్రంలో నటుడు సురేష్ గోపి సీఎం పాత్రలో నటించారు. అవినీతి రాజకీయనాయకులను తుదముట్టడించడానికి ఒక సీఎం కొడుకు సీఎంగా మారి ఎలాంటి  నిర్ణయాలు తీసుకుంటాడన్నది ఈ చిత్రకథ. అదేవిధంగా 2009లో తెలుగులో వచ్చిన "అధినేత" చిత్రం కాస్త వైవిధ్యమైన కథతో తెరకెక్కింది. ఒక నిరుద్యోగి ఉద్యోగి, ఒక సీఎం సెక్రటరీగా మారి.. ఆ తర్వాత  ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎలా సీఎం అయ్యాడన్నది ఈ చిత్ర కథ. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన రోజుల్లో ఈ చిత్రం రావడం ఆశ్చర్యకరం. ఇక 2010లో హిందీలో వచ్చిన "రాజ్ నీతి" చిత్రం రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని గురించి చర్చిస్తుంది. ఇందులో సీఎంగా ఉన్న తన భర్త మరణించడంతో ఇందు అనే మహిళ, పార్టీ ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సీఎం అవుతుంది. ఈ సినిమాలో ఇందు పాత్రలో నటి కత్రినా కైఫ్ నటించడం గమనార్హం. ఈ పాత్ర సోనియా గాంధీ పాత్రను పోలి ఉందని విమర్శకుల అభిప్రాయం. ఇదే సంవత్సరం తెలుగులో వచ్చిన మరో చిత్రం "లీడర్" కూడా రాజకీయాల్లోకుటుంబ వారసత్వాల గురించే చర్చిస్తుంది. సీఎంగా ఉన్న తన తండ్రి చనిపోగానే.. సిద్దాంత విలువలు కలిగిన పార్టీని కాపాడడం కోసం.. గత్యంతరం లేని పరిస్థితులలో  పార్టీ ఎమ్మెల్యేలందరినీ డబ్బుతో కొనేసి సీఎం అవుతాడు ఓ ఎన్నారై. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. 

2010లో పరిటాల రవి జీవితకథ ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన పొలిటికల్ థ్రిల్లర్ "రక్తచరిత్ర"లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా.   అలాగే  అదే సంవత్సరం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధివశాత్తు హెలికాప్టర్ ప్రమాదంతో మరణించిన క్రమంలో, ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీశారు కొందరు నిర్మాతలు. ఆ సినిమా పేరే "భగీరథుడు". ఇందులో వినోద్ కుమార్, స్వర్గీయ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించారు. ఇదే సంవత్సరం కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన "సూపర్" చిత్రం కూడా విభిన్నమైన పొలిటికల్ థ్రిల్లరే. సుభాష్ చంద్ర గాంధీ అనే ఒక ఎన్నారై, భారతదేశానికి వచ్చి ఎలా మోడ్రనైజేషన్ వైపు దేశాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడో... ఆఖరికి తానే ఎలా సీఎం అవుతాడో ఈ చిత్రంలో చూడచ్చు.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఓ చిత్రంలో సీఎం పాత్ర పోషిస్తున్నాడని వార్త రావడం నిజంగానే ఆసక్తికరమైన విషయమే.. ఆ సినిమాకి "భరత్ అను నేను" అను టైటిల్ పెట్టినట్లు సమాచారం. మరి  మహేశ్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’ తర్వాత వస్తున్న  ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు రక్తి కట్టిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

 

 

 

Trending News