87 ఏళ్ల బామ్మను హత్య చేసిన 91 ఏళ్ల వృద్ధుడు

కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. 

Last Updated : Sep 1, 2018, 11:40 PM IST
87 ఏళ్ల బామ్మను హత్య చేసిన 91 ఏళ్ల వృద్ధుడు

కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. 81 ఏళ్ల తన భార్యతో తరచూ వాగ్వాదానికి దిగే 91 ఏళ్ల వృద్ధుడు ఓ రోజు ఆమెను తీవ్రంగా చేతికర్రతో కొట్టడంతో పాటు తోసివేయగా ఆమె మరణించింది. అయితే ఆమె స్పృహ కోల్పోయి ఉంటుందని తొలుత ఆ వృద్ధుడు భావించినా.. తర్వాత ఆమె చనిపోయిందని తెలుసుకున్నాక హతాశుడయ్యాడు. వెంటనే ఏం చేయాలో అర్థం కాకపోవడంతో.. ఆమెను ఇంటి వెనుక వైపు ఉన్న పొలంలోకి తీసుకెళ్లి తగులబెట్టాడు. అయితే తన తల్లి కనిపించడం లేదని మరణించిన మహిళ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఎంక్వయరీలో భాగంగా మహిళ భర్తను కూడా ప్రశ్నించారు.

అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన చెబుతున్న సమాధానాలు కొన్ని పొంతన లేకపోవడంతో.. ఆయనను పూర్తిగా అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. కుటుంబ తగాదాల వల్లే తరచూ తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పిన వృద్ధుడు.. అనాలోచితంగానే తన భార్య మరణానికి కారణమయ్యానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి... జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 14 రోజులు రిమాండ్‌కు తరలించారు.

గతకొంత కాలంగా ఒంటరిగా ఉంటున్న ఈ దంపతులకు ఏడుగురు సంతానమని.. తమ పిల్లలకు దూరంగానే ఈ ఆలుమగలు ఉంటున్నారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కుటుంబ కలహాల మూలంగా ఈ దంపతులు ఇద్దరు తరచూ గొడవపడేవారని.. అయితే తన భార్య పట్ల ఆ భర్త ఇంక ఘోరానికి పాల్పడతాడని తాము ఎన్నడూ ఊహించలేదని వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అంటున్నారు. పోలీసులు కూడా నిందితుడిని అదుపులోకి తీసుకొన్నాక.. మృతదేహాన్ని కాల్చిన ప్రదేశానికి అతన్ని తీసుకెళ్లి ఆధారాలను సేకరించారు. 

Trending News