వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సాధించిన ఘన విజయం.. పోఖ్రాన్ పరమాణు పరీక్ష

వాజ్‌ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే పోఖ్రాన్‌లో పరమాణు పరీక్షను నిర్వహించారు. 1998 మే నెలలో ఈ పరీక్ష చేపట్టారు. 

Last Updated : Aug 17, 2018, 09:50 PM IST
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సాధించిన ఘన విజయం.. పోఖ్రాన్ పరమాణు పరీక్ష

వాజ్‌ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే పోఖ్రాన్‌లో పరమాణు పరీక్షను నిర్వహించారు. 1998 మే నెలలో ఈ పరీక్ష చేపట్టారు. ఈ పరీక్షతో భారత్ అణుశక్తి దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచదేశాల్లో భారతదేశం కూడా తన సత్తాను చాటింది. అయితే ఆ పరీక్ష జరిగాక పొగడ్తలతో పాటు విమర్శలు కూడా ఆయనపై వచ్చాయి. అయితే అప్పుడు వాజ్‌పేయి తామేదో ఆత్మ సంతృప్తి కోసం ఈ పోఖ్రాన్ పరీక్ష జరపలేదని.. ఈ పరీక్ష ఓ ఆత్మరక్షణ చర్య అని పేర్కొన్నారు.

భారత్ ఎప్పుడూ ఆత్మ రక్షణ బలాలను పెంపొందించుకోవాలని.. అప్పుడే ప్రపంచదేశాల్లో మనం తలెత్తుకొని తిరగగలమని ఆయన తెలిపారు. అయితే తాము అణు పరీక్షలు జరపడానికి కారణం... అణుశక్తితో యుద్ధాలను అడ్డుకోవాలని మాత్రమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా తమపై ఒత్తిళ్లు వచ్చినా తట్టుకోగలమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో చాలా రహస్యంగా పోఖ్రాన్ ఎడారిలో అయిదు భూగర్భ అణుపరీక్షలను భారత్ వాజ్‌పేయి హయాంలో నిర్వహించింది. ముఖ్యంగా ఈ అణుపరీక్ష పాకిస్తాన్‌కు కంటగింపు కలిగించింది. 

1974లో భారత్ తొలిసారిగా పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత రెండవ సారి కూడా పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అమెరికా నుండి వచ్చిన ఒత్తిళ్లకు ఆ ప్రభుత్వం రాజీ పడిపోయింది. కానీ వాజ్‌పేయి ఈ పరీక్షల కోసం అనేక వ్యూహాలను రచించడం విశేషం. ముఖ్యంగా అమెరికా కళ్లుగప్పి ఈ పరమాణు పరీక్షను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపారు. క్యాబినెట్‌లో ఎవరో ఒకరిద్దరు ముఖ్యమైన వారికి తప్పితే.. ఇంకెవరికి కూడా ఈ పరీక్షల గురించి తెలియకుండా జాగ్రతపడ్డారు. అనిల్‌ కకోద్కర్‌, అబ్దుల్‌ కలాం లాంటి శాస్త్రవేత్తల సహాయం తీసుకొని.. మే 11, 13 తేదిల్లో చాలా చాకచాక్యంగా అయిదు అణు పరీక్షలను రహస్యంగా పోఖ్రాన్‌లో నిర్వహించారు.

అమెరికా కూడా ఆ తర్వాత భారత్ అణుపరీక్షల గురించి తాము తెలుసుకోలేకపోవడం తమ ఓటమేనని ఒప్పుకుంది. అయితే వాజ్‌పేయి కూడా ఈ అణుపరీక్షలకు సంబంధించిన క్రెడిట్ అంతా తనదేనని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆ పరీక్షల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పివి నరసింహారావు అని.. ఆయన హయాంలోనే ఈ పరీక్షలకు తగ్గ ప్లాన్ రెడీ అయ్యిందని.. తమ ప్రభుత్వం కేవలం ఆ ప్లాన్‌ను ఆచరణలో పెట్టిందని చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్న నేత వాజ్‌పేయి. 

ప్రతిపక్షాలు కూడా మంచి చేస్తే పొగడడం వాజ్‌పేయి అలవాటు.  1974లో ఇందిర నిర్వహించిన పోఖ్రాన్‌ అణుపరీక్షల్ని గట్టిగానే సమర్థించారు వాజ్‌పేయి.  ప్రధానిని ఓ విపక్షనేత ప్రశంసించడం అనేది ఆ విధంగా ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అరుదైన విషయంగా మిగిలిపోయింది. వాజ్‌పేయి తలపెట్టిన పోఖ్రాన్ అణు పరీక్ష వల్ల పాకిస్తాన్‌కి యుద్ధభయం కలిగినా.. తాను మాత్రం స్నేహహస్తం చాచారు.  ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏ సమస్యకైనా పరిష్కారాలు చర్చల ద్వారానే సిద్ధిస్తాయని నమ్మిన వ్యక్తి వాజ్‌పేయి. అయినా సరే.. ప్రత్యర్థులు దెబ్బ తీయడానికి చూస్తే ఉపేక్షించేది లేదని చాటిన వ్యక్తి కూడా.

1999 మే-జులై నెలల మధ్య భారత్‌-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కార్గిల్‌‌లో జరిగిన యుద్ధాన్ని (ఆపరేషన్‌ విజయ్‌)ను తొలుత తీవ్రవాదుల దాడిగా పలువురు పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ప్రేరణతోనే అది జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భారత సైన్యం రంగంలోకి దిగి దీటుగానే స్పందించింది. ప్రత్యర్థికి చెమటలు పట్టించి విజయం సాధించింది. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x