అయ్య బాబోయ్.. ఎయిర్ పోర్టులో టీ ఖరీదు రూ.135: కాంగ్రెస్ నేత చిదంబరం

కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ఈ రోజు ట్విటర్‌‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు.

Last Updated : Mar 25, 2018, 06:46 PM IST
అయ్య బాబోయ్.. ఎయిర్ పోర్టులో టీ ఖరీదు రూ.135: కాంగ్రెస్ నేత చిదంబరం

కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ఈ రోజు ట్విటర్‌‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు. తాను చెన్నై విమానాశ్రయంలో టీ సేవించాలని వెళ్లానని.. కాకపోతే అక్కడ ఆ టీ ధర రూ.135 రూపాయలని వినడంతో విస్తుపోయానని చెప్పారు. తాను అంత ఖరీదైన టీ తాగాలని భావించలేదని.. అందుకే వద్దని చెప్పానని తెలిపారు. పోనీ కాఫీ తాగుదామని భావించి.. దాని ధర ఎంత అని అడిగితే.. దాని రేటు రూ.180 అని చెప్పారని ఆయన వాపోయారు. నేనేమైనా ఔట్ డేటెడ్ అయిపోయానా.. అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు.

అయితే చిదంబరం చేసిన ట్వీట్‌కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. "మీరు ఇప్పటికైనా డబ్బులిచ్చి టీ తాగాలని అనుకున్నారు.. సంతోషం" అని ఓ నెటిజన్ కామెంట్  పెడితే.. మరో నెటిజన్ కామెంట్ పెడుతూ "విమానంలో కాకుండా రైలులో ప్రయాణించండి.. అక్కడ క్వాలిటీ లెస్ టీ చాలా తక్కువ ధరకే లభిస్తుంది" అని సలహా ఇచ్చారు.

మరో నెటిజన్ అయితే చాలా విచిత్రమైన కామెంట్ పెట్టాడు. "ఎయిర్ పోర్టులో టీ, కాఫీ ఎప్పుడూ ఒకే రేటుకి అమ్ముతారు. అది ఏ ప్రభుత్వంలోనైనా సరే. అయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆ ధరలపై ట్వీట్ చేయలేదు" అని కౌంటర్ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ "బహుశా మీరు మొదటి సారి ఎయిర్ పోర్టులో టీ తాగుతున్నారనుకుంటా.. అందుకే ఇంత ఫీలవుతున్నారు" అని తెలిపారు. మొత్తానికి తాను చేసిన ట్వీట్‌కి చిదంబరానికి నెగటివ్ కామెంట్లే ఎక్కువ వచ్చాయి

Trending News