ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చిన నిజామాబాద్ రైతులు

ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చిన నిజామాబాద్ రైతులు

Last Updated : Apr 28, 2019, 05:26 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చిన నిజామాబాద్ రైతులు

వారణాసి: లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో ఒకే లోక్ సభ నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో 185 మంది అభ్యర్థులు పోటీపడిన స్థానంగా తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ స్థానం రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ లోక్ సభ పరిధిలో అధిక సంఖ్యలో పసుపు పంట పండించే రైతులు ఏళ్ల తరబడిగా ప్రభుత్వాలు తమకు మద్ధతు ధర కల్పించడం లేదని నిరసన వ్యక్తంచేస్తూ లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసి పోటీలో నిలిచారు. దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక సభ స్థానం దేశంలోనే ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇక్కడి నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగినప్పుడు అధిక సంఖ్యలో నామినేషన్స్‌తో తమ నిరసన తెలియజేసిన నిజామాబాద్ రైతులు తాజాగా మరోసారి దేశం దృష్టిని ఆకర్షించేలా ఈసారి వారణాసి నుంచి నామినేషన్స్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ నుంచి 50 మంది రైతులు శనివారం వారణాసికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఏఎన్ఐతో మాట్లాడిన రైతులు.. ఎవ్వరినీ వ్యతిరేకించడం తమ ఉద్దేశం కాదని, ఎవ్వరికీ వ్యతిరేకంగా తాము ప్రచారం చేయడం లేదని అన్నారు. తాము పండించే పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.15,000 మద్ధతు ధర కల్పించడంతోపాటు పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడిగా తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ యూపిఏ ప్రభుత్వం కానీ లేదీ మోదీ సర్కార్ కానీ ఈ విషయంలో చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం తమ సమస్యను అందరి దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ నిరసన తప్ప ఇంకేమీ కాదని రైతులు అభిప్రాయపడ్డారు.  

ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తోన్న లోక్ సభ నియోజకవర్గంగా పతాక శీర్షికలకెక్కిన వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవడమంటే, అది ప్రధాని మోదీకి షాక్ ఇచ్చేలా, దేశవ్యాప్తంగా జనానికి తెలిసేలా రైతులు తమ నిరసన వ్యక్తం చేయడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News