నేటి నుంచి ఐపీఎల్ పండగ షురూ ...!

గత పదేళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ధనాధన్ ఫార్మాట్ ఐపీఎల్ 11వ సీజన్‌ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. 

Last Updated : Apr 7, 2018, 04:12 PM IST
నేటి నుంచి ఐపీఎల్ పండగ షురూ ...!

గత పదేళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ధనాధన్ ఫార్మాట్ ఐపీఎల్ 11వ సీజన్‌ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది.  51 రోజులు.. 8 జట్లు.. 9  నగరాలు.. 60 మ్యాచ్‌ల మహా సంగ్రామానికి సర్వం సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమై మేలో ముగిసే ఈ క్రీడా సంబరాల కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ సమయంలో సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలు బోసిపోవడం సహజం. ప్రపంచంలోనే ధనిక క్రీడా సంస్థల్లో ఒక్కటైన బీసీసీఐకి కాసులు కురిపించే క్రికెట్ పండగ-ఐపీఎల్ నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.

ఆరంభ వేడుకలు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటులు హృతిక్‌ రోషన్, వరుణ్‌ ధావన్‌, జాక్విలిన్ ఫెర్నాండెస్, తమన్నా భాటియాలతో పాటు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సింగర్ మీకా సింగ్ ఆడిపాడనున్నారు. సాయంత్రం 7:30కు టాస్ వేస్తారు. మొదటి మ్యాచ్ నేడు రాత్రి 8గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ప్రారంభం కానుంది.

పోటీలో పాల్గొనే ఎనిమిది జట్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లి డేర్‌ డెవిల్స్‌, కింగ్స్‌ ఎలవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌.

స్పాన్సర్‌షిప్‌: 2008 నుంచి 2012 వరకు భారతీయ సంస్థ డీఎల్‌ఎఫ్‌ ఏడాదికి రూ. 40కోట్లు చొప్పున చెల్లించి ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2013 నుంచి 2015 వరకు స్పాన్సర్‌షిప్‌ హక్కులు అమెరికా శీతల పానీయాల సంస్థ పెప్సికో దక్కించుకుంది. ఇందుకు ఆ సంస్థ ఏడాదికి రూ.79.2 కోట్లు బీసీసీఐకు చెల్లించింది. 2016, 2017 టోర్నీలకు స్పాన్సర్‌షిప్‌ హక్కులకు గాను చైనా ఫోన్ల తయారీ సంస్థ వివో ఏడాదికి రూ.95కోట్లు చెల్లించింది. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ను కూడా వివో సంస్థనే గెలుచుకుంది. ఇందుకు వివో వెచ్చిస్తున్న వ్యయం ఏడాదికి రూ.439.8 కోట్లు.  మీడియా ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా సంస్థ 2018- 2023 వరకు ఐదేళ్లకుగాను రూ.6,138.1 కోట్లతో కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లను స్టార్ ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్‌లో ఐదు నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారం కానుంది.

జట్లవివరాలివే..!

ముంబై ఇండియన్స్ జట్టు‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్), జస్పీత్‌ బుమ్రా, హర్దిక్‌ పాండ్యా, కిరోన్‌ పొలార్డ్‌, ముస్తఫిర్‌జుర్‌ రహ్మాన్‌, పాట్‌ కమిన్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా, ఇశాన్‌ కిషన్‌, రాహుల్‌ చాహర్‌, ఎవిన్‌ లూయీస్‌, సౌరబ్‌ తివారి, బెన్‌ కట్టింగ్‌, ప్రదీప్‌ సాంగవాన్‌, జీన్‌ పాల్‌ డుమ్ని, తాజిందర్‌ సింగ్‌, శరద్‌ లుంబా, సిద్దేశ్‌ లాడ్‌, ఆదిత్య తారే, మయాంక్‌ మార్కండె, అకిల దనంజయం, అనుకుల్‌ రాయ్‌, మోహసిన్‌ ఖాన్‌, ఎండి నిదీశ్‌, మిచెల్‌ మెక్‌క్లెంగాన్‌.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు: ఎంఎస్‌ ధోనీ(కెప్టెన్), సురేష్‌ రైనా, ఆర్‌. జడేజా, డుప్లెసిస్‌‌, హర్భజన్‌ సింగ్‌, ద్వానె  బ్రావో, షేన్‌ వాట్సన్‌, కేదార్‌ జాదవ్‌, అంబటి రాయుడు, దీపక్‌ చాహర్‌, కెఎం ఆసిఫ్‌, కనిష్క్‌ సేత్‌, లుంగి ఎన్గిడి, ద్రువ్‌ షోరే, మురళీ విజయ్‌‌, సామ్‌ బిల్లింగ్స్‌, మార్క్‌వుడ్‌, క్షితిజ్‌ శర్మ, మోను కుమార్‌, చైతన్య బిష్నోయ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, కర్న్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, ఎన్‌ జగదీశన్‌.

Trending News