టీడీపి ఎంపీలు బీజేపిలో చేరడంపై చంద్రబాబు స్పందన

టీడీపి ఎంపీలు బీజేపిలో చేరడంపై చంద్రబాబు స్పందన

Last Updated : Jun 20, 2019, 11:10 PM IST
టీడీపి ఎంపీలు బీజేపిలో చేరడంపై చంద్రబాబు స్పందన

అమరావతి: నలుగురు టీడీపి రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై టీడీపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపితో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తాం అని ఆ పార్టీలో చేరిన నేతలు చెప్పడం వారి అవకాశవాదానికి నిదర్శనం అని చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరకు కేంద్ర మంత్రి పదవులు కూడా వదులుకున్నామని గుర్తుచేసిన చంద్రబాబు.. రాష్ట్రానికి బలహీనపర్చేందుకు బీజేపి చేసిన కుట్రలను ఖండించామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని.. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన తరపున టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా బీజేపిపై, బీజేపీలో చేరిన నలుగురు టీడీపి ఎంపీల వైఖరిపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు వారాలు కూడా కాకముందే బీజేపి మైండ్ గేమ్ పాలిటిక్స్ కి తెరతీసిందని ఆరోపించారు. అయినా తెలుగు దేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, 37 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, కార్యకర్తలు, ప్రజలే ముందుండి పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్న చంద్రబాబు.. పార్టీ మారుతున్న నేతలే భవిష్యత్తులో పశ్చాత్తాపపడే సందర్భం వస్తుందని అన్నారు.

Trending News