కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు బాసట; రూ. 5 లక్షల ఆర్ధిక సాయం

విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు అభయమిచ్చారు  

Last Updated : Jun 14, 2019, 06:33 PM IST
కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు బాసట; రూ. 5 లక్షల ఆర్ధిక సాయం

విజయవాడ: టీడీపీ కార్యకర్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని పార్టీ అధినేత చంద్రబాబు అభయమిచ్చారు. పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు విజయవాడ వేదికగా చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దాడుల అంశాన్ని పార్టీ అధినేత ముందు ప్రస్తావించారు. 

మూడు వారాల్లో వందకు పైగా దాడులు !!
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మూడు వారాల్లోనే తమ కార్యకర్తలపై వందకుపైగా దాడులు జరిగాయని టీడీపీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ఆస్తులు, శిలాఫలకాల లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయని, ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టడం, తమ కార్యాలయానికి నిప్పుపెట్టడం వంటి దారుణాలకు జరిగాయని అధినేత దృష్టి తీసుకొచ్చారు.

కార్యకర్తల రక్షణ బాధ్యత నేతలదే..!!
ప్రస్తుత సమయంలో దౌర్జన్యాలను ఎదుర్కోవడమే  ముందున్న తక్షణ కర్తవ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు టీడీపీ నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తమ కార్యకర్తలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఒక్కో కుటుంబానికి ఆర్ధిక సాయం రూ.5 లక్షలు
నమ్ముకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ప్రత్యర్ధి పార్టీల వారు చేసిన దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు బాసటగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.  దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు.  

Trending News