టాలీవుడ్‌లో సంచలనమైన టాప్ 10 చిన్న సినిమాలివే

తెలుగులో విడుదలైన అనేక సినిమాల్లో కొన్ని చిన్న సినిమాలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడం చూస్తుంటాం. అందులో కొన్ని సినిమాలు అవార్డులు పొందడం.. అంతర్జాతీయంగా పేరు గాంచడం విశేషం. కొన్ని సినిమాలు భారీ అంచనాలు లేకుండా విడుదలైనా కూడా.. అనతికాలంలోనే ప్రేక్షకుల మదిని దోచుకోవడం కూడా జరుగుతుంటుంది. అలాంటి సినిమాల్లో కొన్ని చిత్రాల గురించి ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం

Last Updated : Sep 24, 2018, 10:24 PM IST
టాలీవుడ్‌లో సంచలనమైన టాప్ 10 చిన్న సినిమాలివే

తెలుగులో విడుదలైన అనేక సినిమాల్లో కొన్ని చిన్న సినిమాలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడం చూస్తుంటాం. అందులో కొన్ని సినిమాలు అవార్డులు పొందడం.. అంతర్జాతీయంగా పేరు గాంచడం విశేషం. కొన్ని సినిమాలు భారీ అంచనాలు లేకుండా విడుదలైనా కూడా.. అనతికాలంలోనే ప్రేక్షకుల మదిని దోచుకోవడం కూడా జరుగుతుంటుంది. అలాంటి సినిమాల్లో కొన్ని చిత్రాల గురించి ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం

ఐతే  - 2003లో దర్శకుడు చంద్రశేఖర ఏలేటి తీసిన ఈ చిత్రం నలుగురు యువతీ యువకుల కథ. భారీ అంచనాలు లేకుండా విడుదలైనా కూడా సూపర్ హిట్ అయ్యింది. మూడు నంది అవార్డులను కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. గుణ్ణం గంగరాజు జస్ట్ యెల్లో మీడియా పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించగా.. కళ్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. 

ఆనంద్ - 2004లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం తొలుత ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనా.. ఆ తర్వాత నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీతో హిట్ చిత్రంగా నిలిచింది. రూప అనే ఓ స్వతంత్ర భావాలున్న యువతి కథ ఇది. మొత్తం ఏడు నంది అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందడం గమనార్హం.

ప్రస్థానం  - 2010లో అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన ఈ చిత్రానికి దేవ్ కట్టా దర్శకత్వం వహించారు. ఓ స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగిన రాజకీయ నాయకుడి చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో సాయికుమార్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. శర్వానంద్, సందీప్ కిషన్ ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటించారు. రెండు నంది అవార్డులతో పాటు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా ఈ చిత్రం కైవసం చేసుకుంది. 

గమ్యం - 2008లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది. ఓ ఇద్దరు యువకులు కలిసి బైక్ మీద చేసే రోడ్డు ప్రయాణం వారికి ఎలాంటి అనుభవాలు మిగులుస్తుందనేది ఈ చిత్రకథ. శర్వానంద్, అల్లరి నరేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. 

ఆ నలుగురు - 2004లో విడుదలైన "ఆ నలుగురు" చిత్రానికి చంద్ర సిద్దార్ధ దర్శకత్వం వహించారు. "మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా.. చివరాంకంలో మనకు అవసరం అయ్యేది ఆ నలుగురు మనుషులే" అనే సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రకథ నడుస్తోంది. ఇందులో రఘరామ్ అనే జర్నలిస్టు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఒదిగిపోయారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. 

నీది నాదీ ఒకే కథ  - 2018లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించారు. నేటి విద్యావ్యవస్థ తీరుతెన్నులను బహిర్గతం చేసిన ఈ సినిమాలో.. రుద్రరాజు సాగర్ అనే స్టూడెంట్ పాత్రలో శ్రీవిష్ణు చాలా బాగా నటించారు. ఈ చిత్రానికి అనుకూలంగా అనేక సమీక్షలు కూడా వచ్చాయి. 

పెళ్లి చూపులు - 2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ కందుకూరి నిర్మాతగా వ్యవహరించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. పరస్పర విరుద్ధ భావాలతో ఉండే యువతీ యువకులు ఓ పెళ్లిచూపుల కార్యక్రమంలో కలుసుకుంటారు. తర్వాత వారిద్దరు కూడా కలిసి ఎలాంటి పరిస్థితుల్లో ఓ ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్రారంభిస్తారు... ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది చిత్రకథ.

సొంతవూరు - 2009లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజా, తీర్థ, ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలలో నటించారు. నేటి కాలంలో సెజ్‌ల పేరుతో చేస్తున్న దోపిడి సామాన్య జనాల జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్నదే ఈ చిత్ర కథ. రుద్రుడనే ఓ కాటికాపరి, మల్లి అనే ఓ వేశ్య, బుజ్జి అనే ఓ యువకుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నాలుగు నంది అవార్డులు ఈ సినిమా కైవసం చేసుకుంది.

నా బంగారు తల్లి - 'ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా' సినిమాతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిన దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. అమాయక బాలికలను వేశ్యావృత్తి వైపు మళ్లించే అక్రమ దళారీ వ్యవస్థపై ఈ సినిమాను తీయడం జరిగింది. అభం శుభం తెలియని బాలికలు, యువతులు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్నారో ఈ చిత్రంలో చూపించడం జరిగింది. దుర్గ (అంజలీ పాటిల్) అనే విద్యార్థి ఏ విధంగా అలాంటి నరకకూపంలో చిక్కుకొని మళ్లీ బయటకు వస్తుందనేది ఈ చిత్రకథ. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది.

కేరాఫ్ కంచరపాలెం - 2018లో వెంకటేష్ మహా అనే దర్శకుడు విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతంలోని వ్యక్తులను ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి తీసిన చిత్రం "కేరాఫ్ కంచరపాలెం". ఈ సినిమాలో అంతర్లీనంగా నాలుగు కథలు ఉంటాయి. ఈ నాలుగు కథలకు ఉన్న సంబంధమేమిటి అన్నదే అసలు కథ. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది

Trending News