Arvind Kejriwal Press Meet: సీబీఐ అధికారులకు థాంక్స్ చెప్పిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal Press Meet After CBI Interrogation: సీబీఐ విచారణ అనంతరం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ జరిగింది అని అన్నారు. సీబీఐ విచారణ జరిగినీ తీరు గురించి చెప్పే క్రమంలో సీబీఐ అధికారులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

Written by - Pavan | Last Updated : Apr 16, 2023, 10:14 PM IST
Arvind Kejriwal Press Meet: సీబీఐ అధికారులకు థాంక్స్ చెప్పిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal Press Meet After CBI Interrogation: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ కార్యాలయం నుంచి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. 9 గంటల 50 నిమిషాల పాటు జరిగిన ఈ విచారణలో సీబీఐ అధికారులు మొత్తం 56 ప్రశ్నలు అడిగినట్టు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ జరిగింది అని అన్నారు.

పూర్తి సహృదయ వాతావరణంలో సీబీఐ విచారణ జరిగిందని, వారు తనతో మర్యాదపూర్వకంగానే ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సీబీఐ అధికారులు తనతో వ్యవహరించిన తీరుకు వారికి తాను కృతజ్ఞతలు చెబుతున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికి తాను సమాధానం ఇచ్చానన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పూర్తి అవాస్తవం అని అరవింద్ కేజ్రీవాల్ మరోమారు స్పష్టంచేశారు. ఈ విషయంలో తాము దాచిపెట్టడానికి ఏమీ లేదని ముందు నుంచి చెబుతున్నట్టుగానే.. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ని రాజకీయ కుట్రల్లోంచి పుట్టిన కుటిల యత్నంగా అభివర్ణించిన కేజ్రీవాల్.. తమ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి బాధ్యతతో, నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడానికి జరుగుతున్న కుట్రల ఫలితమే ఈ కేసులు విచారణలు. కానీ దేశ ప్రజలు ఎప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీకి అండగానే నిలుస్తూ వచ్చారు అని అభిప్రాయపడ్డారు.

అంతకంటే ముందుగా సీబీఐ కార్యాలయం నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటికొచ్చినప్పటి దృశ్యాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

ఇదిలావుంటే, మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని సీబీఐ అధికారులు విచారణకు పిలవడాన్ని తప్పుపడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగగా.. వారిని అరెస్ట్ చేసి నజఫ్‌ఘడ్ పోలీసు స్టేషన్‌కి తరలించిన పోలీసులు.. వారిని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

 

Trending News