నేడు పాక్‌లో ఎన్నికలు: దేశ తలరాతను మార్చే నాయకుడెవరో..!

పాకిస్థాన్‌లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.

Last Updated : Jul 25, 2018, 07:52 AM IST
నేడు పాక్‌లో ఎన్నికలు: దేశ తలరాతను మార్చే నాయకుడెవరో..!

పాకిస్థాన్‌లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార కాసమయాల్లో ఆత్మాహుతి దాడులు, పేలుళ్లు వంటి పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా.. 70 ఏళ్ల దేశ చరిత్రలో రెండు పౌర ప్రభుత్వాల మధ్య అధికార మార్పిడి జరగడం ఇదే రెండోసారి.

పార్లమెంటులోని 272 స్థానాలకు 3,459 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతున్నారు. దేశంలో మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పాకిస్థాన్ పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు 85వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది పాక్ ఎలక్షన్ కమిషన్. పోలింగ్‌ సజావుగా జరగడానికి భారీగానే ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోసం 16 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది, 4 లక్షల మంది పోలీసులు, 3.71 లక్షల మంది సైన్యాన్ని వినియోగిస్తోంది.

పోలింగ్‌ సిబ్బంది 

ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. లెక్కింపు అక్కడిక్కడే జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన 24 గంటల్లోగా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎన్‌, బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పీపీపీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీటీఐ ఈసారి ఎన్నికల్లో  గెలిచే అవకాశం ఉన్నట్లు  పలు సర్వేలు పేర్కొన్నాయి.

Trending News