స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం... ప్రసంగిస్తూనే కుప్పకూలిన వ్యక్తి... గుండెపోటుతో హఠాన్మరణం

76th Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కాప్రా డివిజన్‌లో జరిగిన వేడుకల్లో ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2022, 09:48 AM IST
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం
  • కాప్రా డివిజన్‌లో జరిగిన వేడుకల్లో గుండెపోటుతో వ్యక్తి మృతి
  • సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోనూ విషాద ఘటన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం... ప్రసంగిస్తూనే కుప్పకూలిన వ్యక్తి... గుండెపోటుతో హఠాన్మరణం

76th Independence Day Celebrations: దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి వేడుకలు మరింత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరగ్గా.. ఒకచోట మాత్రం విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఊహించని ఘటనతో వేడుకలో పాల్గొన్నవారంతా షాక్ తిన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాప్రా డివిజన్‌లోని లక్ష్మీ ఎలైట్ విల్లాస్ కాలనీలో సోమవారం (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఉప్పల సురేష్ (56) అనే ఫార్మా వ్యాపారి పాల్గొన్నాడు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉద్దేశించి సురేష్ ప్రసంగించాడు. అయితే ప్రసంగం మధ్యలోనే హఠాత్తుగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సురేష్ మరణంతో ఆయన కుటుంబంతో పాటు కాలనీలో విషాదం నెలకొంది.

ఉప్పల సురేష్ స్వగ్రామం జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్. 25 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫార్మా రంగంలో స్థిరపడ్డారు. ప్రతీ ఏటా ఆగస్టు 15న జరిగే జెండా పండగలో సురేష్ తప్పక పాల్గొంటాడు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై యువతను ఉత్తేజపరిచేలా ప్రసంగిస్తాడు. ఈసారి ప్రసంగం మధ్యలోనే ఛాతి నొప్పితో హఠాన్మరణం చెందాడు. సురేష్ రెండు నెలల క్రితమే హెర్నియా చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయంలో తిరుపతి (42), అనిల్ కుమార్ (40) అనే ఇద్దరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ధనుంజయ (38) అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబాలను పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరామర్శించారు.

Also Read: Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..

Also Read: Planet Transition 2022: ఈ 4 రాశుల వారికి 4 నెలల అదృష్టం... జీవితంలో అద్భుత మార్పులకు సమయం ఆసన్నమైంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News