నాకు సభలో మాట్లాడే హక్కు లేదా ? టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ రెబల్‌ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, ఆయన తనయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీతో పాటు స్పీకర్‌పై విమర్శలు చేస్తూ టీడీపీ సభ్యులు సభలోంచి వాకౌట్‌ చేశారు.

Last Updated : Dec 10, 2019, 03:10 PM IST
నాకు సభలో మాట్లాడే హక్కు లేదా ? టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అమరావతి: టీడీపీ రెబల్‌ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, ఆయన తనయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీతో పాటు స్పీకర్‌పై విమర్శలు చేస్తూ టీడీపీ సభ్యులు సభలోంచి వాకౌట్‌ చేశారు. వల్లభనేని వంశీ మాట్లాడిన అనంతరం టీడీపీ సభ్యులు మళ్లీ సభకు హాజరయ్యారు. ఇదిలాఉండగా కేవలం గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మద్దతిచ్చానని వల్లభనేని వంశీ పునరుద్ఘాటించారు. తాను నియోజకవర్గ సమస్యలపైనే సీఎం జగన్‌ను కలిశానని... అయితే, ముఖ్యమంత్రిని ఎందుకు కలిశావని పేర్కొంటూ తనను టీడీపీ నుంచి తొలగించారని వల్లభేనని మండిపడ్డారు. అసెంబ్లీలో తాను మాట్లాడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని టీడీపీ సభ్యులను ఎద్దేవా చేసిన వల్లభనేని వంశీ.. తాను కూడా టీడీపీ సభ్యుడినే కదా అని వ్యాఖ్యానించారు. తనకు సభలో మాట్లాడే హక్కు లేదా అని వల్లభనేని ప్రశ్నించారు.  

Read also : చంద్రబాబు తీరుపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

పేదల కోసం సీఎం వైఎస్‌ జగన్ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారని ముఖ్యమంత్రిని కొనియాడిన వంశీ.. పోలవరం కుడికాలువపై మోటార్ల బిగింపు, ఇంగ్లీష్‌ మీడియం తదితర పథకాలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై తన అభ్యంతరాలను టీడీపీ పట్టించుకోలేదని టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పప్పు బ్యాచ్‌, పొట్టిరాయుళ్లు, పొలావ్‌ పొట్లాళ్లగాళ్లతో తనను తిట్టించారన్నారు. టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 28న వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను ఇచ్చిన సంగతి తెలిసిందే.

Trending News