మహేష్ బాబుని షూటింగ్ స్పాట్‌కి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబును కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 

Last Updated : Jun 19, 2018, 04:03 PM IST
మహేష్ బాబుని షూటింగ్ స్పాట్‌కి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఆ క్రేజ్ సొంత రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉందని తెలిపే ఘటన ఒకటి తాజాగా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా ప్రస్తుతం ఉత్తరాఖండ్‌‌లోని పర్యాటక ప్రాంతమైన డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ సోమవారమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవగా.. అక్కడ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న స్థానిక ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ నేరుగా అక్కడికి వెళ్లి మహేష్ బాబుని కలిశారు. ఈమేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మహేశ్‌ బాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా సోషల్ మీడియాలో పలు ఫోటోలు సైతం వైరల్ అవడం మొదలుపెట్టాయి. 

మహేష్ బాబు నటించిన చివరి చిత్రం భరత్‌ అనే నేను లో అతడు సైతం ఓ ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే జంటగా నటించనుంది. మొదటిసారిగా మహేష్ బాబు సినిమాలో అల్లరోడు అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషించనుండటం విశేషం. 

Trending News