సుప్రీంకోర్టు ఆదేశాలు: రేపటి నుంచి కార్లు, బైకుల ధరలు భారీగా పెరగనున్నాయ్..

శనివారం నుండి (సెప్టెంబర్ 1) కార్లు, బైకుల ధరలు మరింత పెరగనున్నాయి.

Last Updated : Aug 31, 2018, 07:35 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు: రేపటి నుంచి కార్లు, బైకుల ధరలు భారీగా పెరగనున్నాయ్..

శనివారం నుండి (సెప్టెంబర్ 1) కార్లు, బైకుల ధరలు మరింత పెరగనున్నాయి. వాహనాలపై దీర్ఘకాల థర్డ్‌పార్టీ బీమా తప్పనిసరి కావడంతో ధరలు పెరగనున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల అనుసారం.. కొత్త కార్లకు మూడేళ్ల కాలానికి, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల కాలానికి థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ జారీ చేయడం తప్పనిసరి. సుప్రీం ఆదేశాలను శనివారం నుండి అమల్లోకి తీసుకురావాలని ఇన్సురెన్స్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో కార్ల యజమానులు, బైక్ యజమానులు సెప్టెంబర్ 1 నుంచి ఒకేసారి మూడేళ్లకు, ఐదేళ్లకు థర్డ్‌పార్టీ బీమా చేయించుకోవాలి. కొత్త కారు కొనుగోలు చేసేవారు రూ.24, 000, కొత్త బైక్ కొనుగోలు చేసేవారు రూ. 13,000 ప్రీమియం చెల్లించాలి.   

1,000 సిసి కంటే తక్కువ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన కార్లపై థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం కింద రూ.5,286, 1,000-1,500 సిసి వరకు రూ.9,534, 1,500కు పైగా సిసి కార్లపై రూ.24,305 చెల్లించాలి.

ద్విచక్ర వాహనాల విషయానికొస్తే.. 75సిసి కంటే తక్కువ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన బైక్‌లకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం కింద రూ.1,045, 75-150సిసి వరకు రూ.3,285, 150-350 సిసి వరకు రూ.5,453, 350కి పైగా సిసి బైక్‌లపై రూ.13,034 ప్రీమియం చెల్లించాలి. వాహనం చోరీకి గురైనప్పుడు లేదా యాక్సిడెంట్‌ అయినప్పుడు జరిగిన నష్టానికి ఈ బీమా ద్వారా కవరేజీ లభిస్తుంది.

Trending News