పీఎన్‌బీ అధికారులకు నీరవ్ మోదీ లంచంగా ఇచ్చింది ఇవే..

పీఎన్‌బీ స్కామ్‌ డొంకనంతా సీబీఐ అధికారులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు.

Last Updated : Mar 4, 2018, 05:19 PM IST
పీఎన్‌బీ అధికారులకు నీరవ్ మోదీ లంచంగా ఇచ్చింది ఇవే..

పీఎన్‌బీ స్కామ్‌ డొంకనంతా సీబీఐ అధికారులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. కేసు ఛేదిస్తున్న సమయంలో విస్మయం గొలిపే విషయాలను వెల్లడిస్తున్నారు. బ్యాంకు అధికారుల సాయంతోనే ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది. నీరవ్‌ మోదీ బ్యాంకు అధికారులకు బంగారం, డైమండ్‌ నగలను లంచంగా ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కోర్టుకు శనివారం ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది.

ఈ కేసులో సీబీఐ మొత్తం 14 మందిని అరెస్టు చేసి విడివిడిగా విచారణ చేసింది. ఈ క్రమంలో నీరవ్ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సిబ్బందికి లంచం ఇచ్చినట్లు తెలిసింది. ముంబై బ్రాంచ్‌ ఫోరెక్స్‌ బ్రాంచ్ మేనేజర్‌ యశ్వంత్‌ జోషి నీరవ్‌ మోదీ నుంచి 60 గ్రాముల విలువ గల రెండు బంగారు కాయిన్లను, ఒక జత గోల్డ్‌, డైమండ్‌ ఇయర్‌ రింగ్స్‌ను తీసుకున్నట్లు అంగీకరించాడని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. వీరితోపాటు మరికొందరు కూడా తాము లంచం తీసుకున్నట్లు అంగీకరించారని తెలిపింది.

దీంతో బ్యాంక్‌ సిబ్బంది సహకారంతోనే ఈ భారీ కుంభకోణం జరిగినట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చింది. జోషితోపాటు మరో నలుగురు పీఎన్‌బీ అధికారులు, ఇద్దరు బ్యాంక్‌ ఆడిటర్లు, మోదీ సహయకుడు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. వీరి వద్ద నుండి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రూ.12,600 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో ముంబై కోర్టు మోదీ, చోక్సీలపై నాన్‌ బెయిల్‌బుల్‌ వారంట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Trending News