అనుమానాస్పద స్థితిలో కాలిన మహిళ శవం లభ్యం !

హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ శవం లభ్యమవడం కలకలం సృష్టించింది. 

Last Updated : Apr 3, 2018, 10:23 PM IST
అనుమానాస్పద స్థితిలో కాలిన మహిళ శవం లభ్యం !

హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ శవం లభ్యమవడం కలకలం సృష్టించింది. భర్త, ఆరు నెలల కొడుకుతో కలిసి నివసిస్తోన్న సౌమ్య అనే మహిళ ఇంట్లో ఉన్నట్టుండి శవమై కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాలిపోయిన సౌమ్య శవాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రాథమికదర్యాప్తు జరిపిన అనంతరం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సౌమ్య సోమవారం అర్థరాత్రి 12:30 గంటలకు చనిపోయి వుంటుందని పేర్కొన్నట్టుగా ది హన్స్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగింది అనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. 

వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన సౌమ్య భర్త సోమవారం రాత్రి 8:30 గంటలకు ఉద్యోగానికి వెళ్లగా ఆ తర్వాత సౌమ్య ఇంట్లో శవమై కనిపించడం, ఇంటి తలుపులు బయటి నుంచి తాళం వేసి వుండటంపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సౌమ్యది ఆత్మహత్య కాకపోవచ్చని, హత్యే అయ్యుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్య శవాన్ని మొదటిసారిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన ఇరుగుపొరుగు వారే ఆమె కొడుకుని ఆ ఇంట్లోంచి కాపాడి వెలికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Trending News