ముంబై నుంచి సింగపూర్: ముంబై నుంచి సింగపూర్ బయల్దేరిన సింగపూర్ ఎయిర్ లైన్స్కి చెందిన SQ-423 విమానంలో బాంబ్ ఉందన్న ఫోన్ కాల్ బెదిరింపుల నేపథ్యంలో సింగపూర్ వైమానిక దళానికి చెందిన రెండు F-16 యుద్ధ విమానాలు ఆ విమానానికి భద్రత కల్పిస్తూ ఎస్కార్ట్గా వెళ్లిన ఘటన మంగళవారం సింగపూర్లో చోటుచేసుకుంది. ఎఫ్-16 విమానాలు తోడుగారాగా సింగపూర్ ఎయిర్ లైన్స్కి చెందిన ఆ విమానం సింగపూర్లోని చాంగి విమానాశ్రయంలో సురక్షితంగా దిగిందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి.
263 మంది ప్రయాణికులతో విమానం చాంగి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే భద్రతా బలగాలు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు జరిపాయి. అయితే, ఈ తనిఖీల్లో విమానంలో ఎటువంటి బాంబు లభించలేదు. బోయింగ్ 777-300ER రకానికి చెందిన ఈ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 11:36 గంటలకు సింగపూర్ బయల్దేరింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విమానం సింగపూర్ గగనతలంపైకి చేరిన వెంటనే రెండు యుద్ధ విమానాలు గాల్లోకి లేచి విమానాన్ని చాంగి ఎయిర్ పోర్టుకి ఎస్కార్ట్ చేశాయి.