ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు!

ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు!

Last Updated : Feb 9, 2019, 05:46 PM IST
ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు!

హైదరాబాద్: రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జెరూసలేం మత్తయ్య నేడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో తనను అక్రమంగా, బలవంతంగా ఇరికించారని జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో జెరూసలేం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. ''తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తన ‌పేరు చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను'' అని అన్నారు. ఈ కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన ఏపీ సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంతకన్నా ముందుగానే ఈ కేసును దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. 

ఓటుకు నోటు కేసు దర్యాప్తులో తనకు న్యాయం జరగలేదని, తాను నిర్దోషినని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఉదయ్‌సింహతో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలని పట్టుబట్టారని చెబుతూ కేసీఆర్ తనను ప్రలోభాలకు గురిచేశారని మత్తయ్య ఆరోపించారు. సీబీఐ, ఎన్‌ఐఎతో ఈ కేసు విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆందోళనకు దిగనున్నట్టు స్పష్టంచేసిన మత్తయ్య.. తన దీక్షకు పలు క్రిస్టియన్ సంఘాలు సైతం మద్దతు ప్రకటించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఓటుకు నోటు కేసు కోర్టులో వున్న సంగతి తెలిసిందే.

Trending News