రక్షణ, ఆర్థిక వ్యవస్థలకు నౌకాయానం కీలకం - రాష్ట్రపతి

 విశాఖలోని ఐఎన్ఎస్ సర్కార్ మైదానంలో ప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతిథిగా హాజరయ్యారు.   

Last Updated : Dec 8, 2017, 06:09 PM IST
రక్షణ, ఆర్థిక వ్యవస్థలకు నౌకాయానం కీలకం - రాష్ట్రపతి

విశాఖపట్నం: భారతీయ నావికాదళంలోకి జలాంతర్గాములు ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలోని ఐఎన్ఎస్ సర్కార్ మైదానంలో ప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు కూడా  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ  నౌకాయానంలో భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని.. 90 శాతం వర్తకమంతా నౌకల ద్వారానే జరుగుతోందని అన్నారు. భారత ఆర్థిక పురోగతి నౌకాయాన రంగంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. వర్తకంతో పాటు రక్షణ రంగంలో కూడా మన నౌకాయానం ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. జలాంతర్గాముల విభాగం నేడు నౌకాదళంలో అత్యంత శక్తిమంతమైందిగా ఉందని.. నౌకాదళంలో దాదాపు 25 సబ్‌మెరైన్లు ఉన్నాయని తెలిపారు. శత్రవుల నుండి దేశాన్ని కాపాడే దిశగా ప్రయత్నిస్తూ.. నౌకాదళం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నానని అన్నారు. 

గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి

ప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నావికా దళం పెరేడ్ నిర్వహించింది. ఈ సందర్భంగా నావికాదళం ఇచ్చిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో 39 మంది అధికారులు, 621 మంది నావికులు, సబ్‌మెరైన్‌కి చెందిన 150 మంది నావికులు పాల్గొన్నారు

Trending News