టాలీవుడ్‌లో మళ్లీ "చారిత్రక" చిత్రాల హవా

   తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకూ వచ్చిన చారిత్రక చిత్రాలపై ఓ ప్రత్యేక వ్యాసం

Last Updated : Mar 9, 2018, 08:23 PM IST
టాలీవుడ్‌లో మళ్లీ "చారిత్రక" చిత్రాల హవా

చారిత్రక చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అంతకు మించి ప్రేక్షకులకూ ఆసక్తి ఉంటుంది. ఒకప్పుడు చరిత్రను తెలుసుకోవాలంటే ప్రజలు గ్రంథాలను అధ్యయనం చేయడమో, జీవిత చరిత్రలను చదవడమో చేసేవారు.. లేకపోతే బుర్రకథలో, ఒగ్గుకథలో వినేవారు.  కొంతకాలం చారిత్రక కథలను చెప్పడానికి నాటకరంగం కూడా ఎంతో సహకరించింది. అయితే కాలంతో పాటు జనాల అభిరుచులు కూడా మారాయి.. మారుతున్నాయి.. మారతాయి కూడా. సినిమా అనేది భారతదేశంలో నేడు కోట్లాది మందికి చేరిన గొప్ప కళారంగం. చారిత్రక చిత్రాలను ఆదరించడం తెలుగు సినిమా అభిమానులకు కొత్త కూడా కాదు. కొంతకాలం వీటి మోజు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ జనాల ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి కమర్షియల్ హంగులతో అవే చిత్రాలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఒకసారి గతంతో పాటు వర్తమానాన్ని కూడా ఓ సారి అవలోకనం చేసుకుందాం..

తెలుగులో తొలి చారిత్రక చిత్రం "సారంగధార" 1930లో విడుదలైంది. గురజాడ అప్పారావు గారు తెలుగులో పద్య కావ్యంగా రచించిన గ్రంథమే సారంగధార. రాజమహేంద్రవరాన్ని పరిపాలించే వేంగి రాజు రాజరాజ నరేంద్రుని కుమారుడే సారంగధరుడు. అతని ప్రేమకథే సారంగధార. అదే చిత్రం 1937లో అద్దంకి శ్రీరామమూర్తి హీరోగా పి.పులయ్య దర్శకత్వంలో విడుదలైంది. మళ్లీ 1957లో అదే చిత్రం ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది.

1950 నుండి 1970 కాలం వరకు తెలుగులో అనేక చారిత్రక చిత్రాలు వచ్చాయి. తెలుగుచిత్రసీమలో అత్యధిక చారిత్రక చిత్రాలలో నటించిన నటుడు నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు అనే చెప్పవచ్చు. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడిగా నటించినా.. బొబ్బలి యుద్ధంలో రంగారావుగా జీవం పోసినా అది ఆయనకే చెల్లింది. శ్రీకృష్ణదేవరాయలుగా, చంద్రగుప్తుడిగా, అశోకుడిగా.. ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు నిండుదనం తీసుకురావడం ఆయనకే చెల్లింది. చాణక్య చంద్రగుప్త, మహామంత్రి తిమ్మరుసు, అక్బర్ సలీం అనార్కలి, సామ్రాట్ అశోక లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలకు న్యాయమే చేశారు. ఆ సినిమాలకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఇక అక్కినేని నాగేశ్వరావు విషయానికి వస్తే, ఆయన కూడా స్వర్గీయ ఎన్టీఆర్‌తో కలిసి అనేక చారిత్రక చిత్రాల్లో నటించారు. తెనాలి రామక్రిష్ణ అందులో ప్రముఖమైనది. తెనాలి రామలింగడిగా ఏఎన్నార్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అలాగే ఏఎన్నార్ నటించిన అమరశిల్ప జక్కన్న కూడా చారిత్రక చిత్రమే.

1951లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం చారిత్రక చిత్రాలలో ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న చిత్రం. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అంతఃపుర కాంతగా చేరిన ఓ యువతి పేరే మల్లీశ్వరి. నాగరాజు అనే శిల్పిని ప్రేమించిన ఆమె ఎలా రాయలవారి ఆగ్రహానికి గురవుతుందో.. ఆఖరికి ప్రేమికులు ఎలా కలుసుకుంటారన్నది చిత్ర కథ. ఇందులో ప్రేయసీ ప్రియులుగా భానుమతి, ఎన్టీఆర్ నటించడం విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ విషయానికి  వస్తే, ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం "అల్లూరి సీతారామరాజు" 1974లో విడుదలైంది. ఆ పాత్రలో ఆయన నటించిన తీరు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు కథను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కిన ఈ చిత్రం నంది అవార్డు కూడా కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో తర్వాత కృష్ణ, శివాజీ గణేషన్ కాంబినేషన్‌లో "విశ్వనాథ నాయకుడు" చిత్రం తీశారు. ఇందులో కృష్ణదేవరాయల సేనాని నాగమ నాయకుడిగా శివాజీ గణేషన్ నటించగా, ఆయన కుమారుడు విశ్వనాధ నాయకుడిగా కృష్ణ నటిస్తారు. అలాగే కృష్ణదేవరాయల పాత్రలో నటుడు కృష్ణంరాజు నటించారు. అయితే అదే కృష్ణంరాజు బొబ్బిలి వీరుడైన "తాండ్ర పాపారాయుడు" చిత్రంలో టైటిల్ రోల్ పోషించడం విశేషం.

1976లో బాలకృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన "వేములవాడ భీమకవి", ఎన్టీఆర్ ఆఖరి చిత్రం, 1999లో విడుదలైన "శ్రీనాథ కవిసార్వభౌమ" కూడా చారిత్రక చిత్రాలే. చారిత్రక చిత్రాలను తనదైన శైలిలో చేసిన నటులలో నటుడు విజయ్ చందర్ ఒకరు. 1982లో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జీవితకథ ఆధారంగా తీసిన "ఆంధ్రకేసరి"లో ఆయన నటించారు. అలాగే కబీర్ దాస్ చిత్రంలో కూడా నటించారు. 1992లో బాలీవుడ్ నటుడు ఆకాష్ ఖురానా కూడా ఓ తెలుగు చిత్రంలో నటించారు. ఆ చిత్రమే "డాక్టర్ అంబేద్కర్". భరత్ పారేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. 

మిగతా భాషల్లో విడుదలై తెలుగులో డబ్ అయిన చారిత్రక చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో బాలీవుడ్ నుండి తెలుగులోకి డబ్ చేయబడిన జోధా అక్బర్, మంగళ్ పాండే, గురు లాంటి చిత్రాలు ప్రముఖమైనవి. మలయాళంలో ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన "బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్" చిత్రం కూడా తెలుగులో డబ్ చేయబడింది. ఇక డైరెక్టుగా బాలీవుడ్‌లో తీసిన చారిత్రక చిత్రాలంటే లెక్కలేనన్ని ఉంటాయి. తెలుగులో డబ్ చేయని వాటిని పక్కన పెడితే చరిత్ర గుర్తుపెట్టుకోదగ్గవి కూడా ఉన్నాయి. మొఘల్ ఏ ఆజామ్, లైలా మజ్ను, లగాన్, తాజ్ మహల్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, బాజీరావ్ మస్తానీ లాంటి చిత్రాలు అందులో ప్రముఖమైనవి.

తమ ప్రాంతీయ వీరులు, స్వాతంత్ర్య సమరవీరుల చరిత్రలను సినిమాలుగా తీయడం అనేక సంవత్సరాలుగా జరుగుతోంది. శివాజీ గణేషన్ హీరోగా తమిళంలో వీరపాండ్య కట్టబొమ్మన తీసినా, కన్నడంలో రాజ్ కుమార్ కథానాయకుడిగా కంఠీరవ తీసినా ప్రేక్షకులు ఆదరించారు. 1990లో తెలంగాణ సాయుధపోరాట యోధుడు "కొమురం భీమ్" జీవితకథ ఆధారంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఓ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం నంది అవార్డు కైవసం చేసుకుంది. 

1980ల్లో, 1990ల దశకం తర్వాత అడపా దడపా తప్ప పెద్దగా చారిత్రక చిత్రాలు ఏమీ రాలేదు. వచ్చినా అందులో గుర్తుపెట్టుకోదగ్గవి కూడా చాలా తక్కువే. ప్రేక్షకులందరూ మాస్, లవ్,  ఫ్యామిలీ సెంటిమెంటున్న సాంఘిక చిత్రాలవైపే మొగ్గుచూపడంతో చారిత్రక చిత్రాలవైపు కూడా ఎవ్వరూ మొగ్గు చూపలేదు. అలాంటి సమయంలో 2015లో అనుష్కను కథానాయికగా పెట్టి తీసిన "రుద్రమదేవి" మళ్లీ చారిత్రక చిత్రాల పట్ల జనాల ఆసక్తిని లోకానికి తెలిపింది. అయితే జానపద చిత్రమైన బాహుబలి విడుదలైన తర్వాతే  గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రం 2017లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు క్రిష్  హిందీలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా "మణికర్ణిక" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దీపికా పడుకొనే కథానాయికగా రాణీ పద్మిని జీవితం ఆధారంగా "పద్మావతి" చిత్రాన్ని తెరకెక్కించారు 

ఇలాంటి సందర్భంలో తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ చారిత్రక చిత్రానికి సైన్ చేశారు. తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా "సైరా నరసింహారెడ్డి" అనే చిత్రం చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి.. ఈ చిత్రం తెలుగులో మరెన్ని చారిత్రక చిత్రాలు నిర్మితమవడానికి ప్రేరణగా మారుతుందో వేచి చూడాల్సిందే. 

Trending News