దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా 'తావిసి'

దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి రికార్డులకెక్కింది.

Last Updated : May 20, 2018, 10:53 AM IST
దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా 'తావిసి'

చెన్నై: దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి రికార్డులకెక్కింది. తావిసి తల్లి మధుమిత రమేష్ భర్త చరణ్ రాజ్ నుంచి విడిపోయింది. ఓ వీర్య దాత ద్వారా తావిసికి జన్మ నిచ్చింది. దీంతో తిరుచ్చి అధికారులు తావిసికి బర్త్ సర్టిఫికేట్ ఇస్తూ తండ్రి పేరును మనీష్ మదన్ పాల్ మీనా (వీర్యదాత)గా పేర్కొన్నారు. సంతానోత్పత్తి చికిత్స కోసం మధుమితకు ఆయన సాయం చేయడంతో అతడి పేరును బర్త్ సర్టిఫికెట్‌లో చేర్చారు.

అయితే, తావిసి తండ్రిగా మదన్‌ను పేర్కొనడాన్ని నిరసిస్తూ దానిని తొలగించాల్సిందిగా మధుమిత అధికారులను కోరగా.. వారు నిరాకరించడంతో ఆమె మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. కేసును పరిశీలించిన బెంచ్ సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అయితే, రెవెన్యూ డివిజనల్ అధారి మరోమారు ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో మధుమిత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తండ్రి కాలమ్‌ నుంచి మదన్ పేరును తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

మరోవైపు తావిసి తండ్రిని తాను కాదంటూ మనీష్, మధుమిత నుంచి విడిపోయిన భర్త చరణ్ రాజ్‌లు విడివిడిగా కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో స్పందించిన జస్టిస్ ఎంఎస్ రమేష్ నేతృత్వంలోని ధర్మాసనం త్రిచీ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆమె వీర్య దాత ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి తండ్రి పేరు లేకుండానే బర్త్ సర్టిఫికేట్(జనన ధృవీకరణ పత్రం) ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

Trending News