కన్నడ రాజకీయాలు: రాజ్‌భవన్ టు సుప్రీంకోర్టు..?

గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Last Updated : May 16, 2018, 04:08 PM IST
కన్నడ రాజకీయాలు: రాజ్‌భవన్ టు సుప్రీంకోర్టు..?

బెంగళూరు: కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. కుమారస్వామిని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే..!

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూడు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుందని కథనాలు వస్తున్నాయి. మొదటి ప్రణాళిక ప్రకారం జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌ వద్ద పరేడ్‌ చేయాలని, రెండవ ప్రణాళిక ప్రకారం గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇక చివరగా జేడీఎస్ ‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి వద్ద పరేడ్‌ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా  జేడీఎస్-కాంగ్రెస్‌ నేతలకు నేటి సాయంత్రం  5 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని సమాచారం. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి సీఎంకి మద్దతుగా సంతకాలు చేసిన లేఖను ఇవ్వనున్నారు.

 

 

 

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌ను గవర్నర్‌ ఆహ్వానించకపోతే రాష్ట్రపతిని సంప్రదించాలని ప్రతిపక్ష నేతలు పలువురు కుమారస్వామికి సూచించారట. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఉన్నందున రాష్ట్రపతి జోక్యం కోరాలని ప్రతిపక్ష నేతలు చెప్పారట.

బీజేపీ అనైతిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోంది: సిద్దూ

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చూస్తానని కాంగ్రెస్‌ నాయకుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ అనైతిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌-జేడీఎస్ కూటమికి గవర్నర్‌ అవకాశమివ్వాలని కోరారు.  గవర్నర్ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, ఒకవేళ గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని గులాంనబీ ఆజాద్ అన్నారు.

 

 

Trending News