Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!

Karnataka Elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. 5.2 కోట్ల మంది నేడు తీర్పు ఇవ్వనున్నారు. ప్రచార పర్వానికి ఇప్పటికే తెరపడగా.. గెలుపు ఎవరి వైపు ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 10, 2023, 06:01 AM IST
Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!

Karnataka Elections Live Updates: దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకిత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.17 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. మొత్తం 224 స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో 2,427 మంది పురుషులు, 185 మంది మహిళలు ఉన్నారు. ఒకరు ఇతరుల కేటగిరీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం పర్వం ముగిసిపోవడంతో అభ్యర్థులు ఓటరు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ముందు నుంచే కసరత్తు చేస్తోంది. 2018లో 72.36 శాతం నమోదవ్వగా.. ఈసారి అంతకుమించి ఓటు హక్కు వినిగియోంచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ.. వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఏ పార్టీకి అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందో చూడాలి. బీజేపీ 224, కాంగ్రెస్ 223, జేడీఎస్ 207 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపాయి. బుధవారం ఒకే దశలో పోలింగ్ పూర్తవ్వనుండగా.. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.   

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీస్థాయిలో బందోబస్తును నియమించారు. ఎన్నికల విధుల్లో 304 మంది డీఎస్పీలు, 991 మంది ఇన్‌స్పెక్టర్లు, 2,610 మంది ఎస్‌ఐలు, 5,803 మంది ఏఎస్‌ఐలు, 46,421 మంది హెచ్‌సీలు, 27,990 మంది హోంగార్డులు సహా మొత్తం 84,119 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 8,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డులను రప్పించారు. 650 CAPF కంపెనీలతో పాటు రాష్ట్ర సాయుధ రిజర్వ్ ఫోర్స్ కూడా ఎన్నికల సంఘం మోహరించింది. భద్రతా విధుల కోసం మొత్తం 1,56,000 మంది పోలీసు సిబ్బందిని నియమించింది. 11,617 పోలింగ్ బూత్‌లను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని.. శాంతిభద్రతల పరిరక్షణకు ఈ పోలింగ్ స్టేషన్‌ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Jangaon MLA Muthireddy Yadagiri Reddy: ప్రత్యర్ధులు నా బిడ్డను ఉసిగొల్పారు.. ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News