Bandi Sanjay: ట్విటర్ టిల్లు నన్ను కెళకాలని చూస్తున్నాడు.. నేను ఊరుకుంటానా ?

Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 05:44 AM IST
Bandi Sanjay: ట్విటర్ టిల్లు నన్ను కెళకాలని చూస్తున్నాడు.. నేను ఊరుకుంటానా ?

Bandi Sanjay Satires on Kavitha and KTR: "తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీ నెల ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే చెల్లిస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం. 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి జీతాలిచ్చే దుస్థితి వస్తుందని, అంతేకాకుండా సీఎం కేసీఆర్ మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తి దివాళా తీయిస్తాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో ఉన్న కేసీఆర్‌కు టీచర్ల సత్తా ఏంటో చూపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ చెంప చెళ్లమనిపించాలని ఓటర్లను, ఉపాధ్యాయ సంఘాలను విజ్ఞప్తి చేశారు. 

కొంపల్లిలో జరుగుతున్న ‘‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’’ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కావు. అసెంబ్లీ ఎన్నికల వరకు మరే ఎన్నికల్లేవు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణలో పేదలు పడుతున్న బాధలను గుర్తు చేసుకుని ఓటేయండి అని కోరారు.

గత పాలకులు ముఖ్యంగా సీఎం నోట ఏ మాట వచ్చినా కచ్చితంగా అమలయ్యేది. కానీ కేసీఆర్ నోట ఏ మాట వచ్చినా ఇక అంతే సంగతులు. పంజాబ్ రాష్ట్రానికి చెక్కులు పంచితే చెల్లలేదు. పాకిస్తాన్, శ్రీలంక, చైనా గురించి గొప్పగా మాట్లాడితే.. ఆ దేశాలు అడుక్కు తినే స్థాయికి దిగజారాయి. ఇవాళ కేబినెట్ భేటీలో ఇండ్ల జాగా ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షలు చొప్పున ఇస్తాడట. దళిత బంధు ఇస్తాడట... నిలువ నీడ లేని పేదోళ్లకు ఇండ్లు కట్టియ్యని కేసీఆర్... ఆ డబ్బులు ఇస్తానంటే నమ్మేదెవరు అని ప్రశ్నించారు. 

కేబినెట్ భేటీలో టీచర్ల సమస్యలనే కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరం. పీఆర్సీ ఊసే లేదు. కేసీఆర్‌కు టీచర్లపట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్ధమైతుంది. కసితో బీఆర్ఎస్ పార్టీని ఓడించండి. ఈసారి ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే పీఆర్సీ వేయరు. రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తాడు. డీఏలు ఇవ్వడు. 317 జీవోతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తూనే ఉంటాడు. దయచేసి అన్నీ ఆలోచించి ఓటేయండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. 

 

కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు. అలాగే కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నడు. నేను ఊరుకుంటనా... అంతకంటే ఎక్కువ కెలుకుతా.. నామీద 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెట్టిండు. కేసీఆర్ బిడ్డ మీద ఈడీ, సీబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు. మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించలేదు?

Trending News