Tamilisai Soundararajan: తెలంగాణలో వరుస ఘటనలపై గవర్నర్‌ దృష్టి.. నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశం

Telangana Governor Tamilisai Soundararajan: ప్రగతి భవన్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌ వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలపై కన్నెర్ర జేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 10:17 PM IST
  • ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడైన సాయి గణేష్‌ ఆత్మహత్య
  • కామారెడ్డిలో తల్లీ కొడుకులు పద్మ, సంతోష్‌ ఆత్మహత్య
  • మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్‌ దందా గురించి కూడా గవర్నర్‌ తమిళిసై ఆరా
Tamilisai Soundararajan: తెలంగాణలో వరుస ఘటనలపై గవర్నర్‌ దృష్టి.. నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశం

Telangana Governor Tamilisai Soundararajan: ప్రగతి భవన్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌ వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలపై కన్నెర్ర జేస్తున్నారు. అధికారులను నివేదికలు కోరుతున్నారు. దీంతో, తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థకు, అధికార వ్యవస్థకు మధ్య అంతరం పెరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటీవల బలవన్మరణాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నేతలపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళిసై రంగంలోకి దిగారు. ఏం జరిగిందో సమగ్రంగా నివేదికలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడు సాయిగణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కామారెడ్డి జిల్లాలో తల్లీ కొడుకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు సంఘటనల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపైనా, పోలీసులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్‌ నేతల ప్రోద్భలంతోనే పోలీసులు వేధించారన్న విమర్శలు వచ్చాయి. న్యాయం చేయాల్సిన పోలీసులే వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు దొరికాయి. అయినా, చర్యలు లేవంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రియాక్ట్‌ అయ్యారు. ఈ సంఘటనలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడైన సాయి గణేష్‌.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడని, అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పోలీసులు అతనిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధించారని, నిత్యం నరకయాతన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రోద్భలంతోనే పోలీసులు సాయి గణేష్‌ను టార్గెట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సాయిగణేష్ ఆత్మహత్య కేసులో హైకోర్టు మంత్రి అజయ్‌కి నోటీసులు కూడా జారీచేసింది. మరోవైపు.. ఇదే అంశంపై గవర్నర్‌ తమిళిసై నివేదిక కోరారు. 

ఇక, కామారెడ్డిలో తల్లీ కొడుకులు పద్మ, సంతోష్‌ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో సూసైడ్‌ వీడియో కీలకంగా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌ గౌడ్‌‌తో పాటు మరికొందరి వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంతోష్‌ సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేశాడు. ఈ సంఘటనలోనూ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌.. జిల్లా అధికారులను నివేదిక కోరారు.

అంతేకాదు.. ఖమ్మం సాయిగణేష్‌ కుటుంబసభ్యులతో గవర్నర్‌ తమిళిసై స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. నిన్నటికి నిన్న వరంగల్‌లో యువతిపై హత్యయత్నానికి పాల్పడిన ప్రేమోన్మాది విషయంలోనూ గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. బాధితురాలి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు.. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో వివరాలు తెలియజేయాలంటూ అధికారులను ఆదేశించారు. 

మరోవైపు.. మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్‌ దందా గురించి కూడా గవర్నర్‌ తమిళిసై ఆరా తీశారు. అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ అధికారులను, వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా, నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. వాస్తవానికి వారం రోజులుగా మెడికల్‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. గడిచిన కొన్నేళ్లుగా పలు కాలేజీల్లో సీట్లను బ్లాక్‌ చేస్తూ.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్న విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు నిత్యం నిరసనలు చేపడుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మీడియాలో వస్తున్న వరుస కథనాలతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ఈ అంశంపైనా స్పందించారు.

Also read : Jeevitha Rajashekar Cheating Case: అరెస్ట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్‌..ఏమన్నారంటే..!

Also read : AP & TS weather Forecast: ఏపీ, తెలంగాణ ప్రజలకు వర్షసూచన, కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News