KTR: బరాబర్‌ జైలుకు పోతా.. రేవంత్‌ రెడ్డి అయ్యకు కూడా భయపడను

KTR Speech In Farmers Dharna At Adilabad: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ మోసం చేశారని.. వారిద్దరు దొంగల నుంచి తెలంగాణను కాపాడేది కేసీఆర్‌ అని కేటీఆర్‌ తెలిపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 24, 2024, 06:21 PM IST
KTR: బరాబర్‌ జైలుకు పోతా.. రేవంత్‌ రెడ్డి అయ్యకు కూడా భయపడను

BRS Party Farmers Protest: ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతానని.. దాని కోసం జైలుకైనా వెళ్తానని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. రేవంత్‌ రెడ్డి అయ్యకు కూడా భయపడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలే తిరగబడి ఉరికిచ్చి కొట్టే రోజులు తొందర్లోనే ఉన్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తోందని విమర్శించారు.

Also Read: YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. 'ఆయన ఇంట్లో గొడవల్లేవా?'

రైతు బంధు ఇవ్వకపోవడం, రుణమాఫీ సక్రమంగా చేయకపోవడంపై ఆదిలాబాద్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్‌ జాదవ్‌, మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి హాజరైన కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయాయి. ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసోళ్ల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. 

Also Read: YS Family Dispute: బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ.. జగన్‌పై తల్లీచెల్లి విజయమ్మ, షర్మిల రాసిన లేఖ విడుదల

 

ఎన్ని కష్టాలు వచ్చాయి
'కాంగ్రెస్ పాలనలో పోలీసోళ్ల  కుటుంబాలను పోలీసోళ్లే గుంజుకుపోయే పరిస్థితి ఉంది. ఇక్కడి వస్తుంటే ఉట్నూరులో నీ మీద పెట్టారు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు. ప్రజల కోసం.. రైతుల కోసం జైలుకు పోతా. ఎవ్వని అయ్యకు భయపడేది లేదు' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలే తిరగబడి కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.

'ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తా అని అన్నాడు. మరి మహిళలు లైన్ కట్టి పోలీస్ కేసు పెడితే. రైతులు రైతు భరోసా ఇవ్వలేదని లైన్ కట్టి రైతులు పోలీస్ కేసు పెడితే. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా?' అని కేటీఆర్‌ వివరించారు. 'మేము పదేళ్లు ఉన్నాం. ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు' అని గుర్తుచేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు న్యాయంగా, ధర్మంగా నడుచుకోవాలని హితవు పలికారు.

పోలీసులకు హెచ్చరిక
'ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి మిత్తితో ఇస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుతోనే కొట్లాడినం. ఈ చిట్టి నాయుడు ఎంత? వీడిని చూసి మనం భయపడాల్నా?' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 'ప్రభుత్వ అధికారుల విషయంలో మళ్లీ చెబుతున్నా! చట్టం ప్రకారం నడుచుకోండి. లేదంటే మేము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం' అని కేటీఆర్‌ హెచ్చరించారు. 'హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో 2 వేల ఇళ్లు కూలగొట్టేందుకు వెళ్లారు. ఇళ్లు కూలగొడతా అంటే ఒక పెద్దమనిషి ఒక మాట అన్నందుకు ఒకాయనను జైల్లో పెడతారంటా. వంద రోజుల్లో అన్ని చేస్తా అన్నా లుచ్చాగాళ్లను జైల్లో పెట్టాల్నా, పేద ప్రజలను జైల్లో పెట్టాల్నా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. గరీబులు, రైతులు, విద్యార్థులు, నా మీద కేసులు పెడతా అంటే ఊరుకునే వాళ్లు ఎవరు లేరని పేర్కొన్నారు. 

ఇక్కడి మోసాలు అక్కడ చెప్పాలి
'మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి. మీ పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ మోసాలను చెప్పండి. అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను ఎట్ల మోసం చేశారో వాళ్లకు చెప్పండి' అని కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేస్తే మళ్లీ మోసం జరుగుతుదని మహారాష్ట్ర వాళ్లకు చెప్పాలని తెలిపారు. 

తీవ్రస్థాయిలో విమర్శలు
'ఇక్కడి ముక్రా రైతులు కాంగ్రెస్ లుచ్చాలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. కొమురం భీమ్ పుట్టిన గడ్డలో ఇలాంటి ఉద్యమాలు ఇంకా వస్తాయి. ఇక్కడ రైతులు రుణమాఫీ కాలేదని  దిష్టిబొమ్మలు కాలబెడితే వాళ్లను జైల్లో పెడతారంట. రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మాకు మీరు శక్తిని ఇవ్వండి మీకోసం మేము జైలుకు వెళ్తాం' అని కేటీఆర్‌ ప్రకటించారు.

బీజేపీని అర్సుకున్న కేటీఆర్‌
ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్లు మరీ ప్రమాదకరం. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ  బీజేపీ వ్యక్తే. గుజరాత్‌లో పత్తి క్వింటాలుకు రూ.8,800 అంట. అక్కడికి కన్నా మనకు తక్కువ ఇస్తారంట. గుజరాత్‌కు ఒక నీతి, మనకు ఒక నీతా?' అని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఇచ్చినట్లే పత్తికి  రూ.8,800 ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశారు. 'మోడీ రూ.15 లక్షలు రాలేదు. రేవంత్ రెడ్డి రూ.15 వేలు రాలేదు' అని విమర్శించారు. 'అక్కడ జుమ్లా పీఎం ఉన్నాడు. ఇక్కడ హౌలా సీఎం ఉన్నాడు' అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ శ్రీరామరక్ష
'ఇంకా మూడేళ్లు కొట్లాడేది ఉంది. ఆదిలాబాద్ ప్రజలు మాకు పోరాటం బాట చూపారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా వచ్చే వరకు మనం పోరాటం చేయాల్సిందే' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని అభివర్ణించారు. రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని ప్రకటించారు. మరికొన్ని రోజులు అయితే వీళ్ల ఏడాది మాషికం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. 'బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మకండి. తండ్రి సమానుడైన కేసీఆర్ అందరి కోసం పనిచేస్తారు' అని సూచించారు. 'నరేంద్ర మోదీ, రేవంత్‌ రెడ్డి దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే ఉన్నది ఒక్క కేసీఆర్ మాత్రమే. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బాటలో నడుద్దాం' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News