సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు కార్యకలాపాలు ?

హైకోర్టు విభజన పూర్తయినందున హైకోర్టు కార్యకలాపాలు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.

Last Updated : Dec 27, 2018, 01:40 PM IST
సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు కార్యకలాపాలు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు నిర్ణయం జరిగిన నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలు ఎక్కడి నుంచి జరగాలనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రస్తుతం ఈ అంశంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి అమరావతిలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక హైకోర్టు పనులు పూర్తి కావాలంటే మరో కనీసం 30 రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే జవనరి 1 నుంచి ఏపీకి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తయిన వెంటనే అక్కడికి తరలిస్తారని తెలిసింది.

హైకోర్టు విభజన అంశంపై చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్నారు. పరిపాలనకు సంబంధించిన అన్ని శాఖలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయి. హైకోర్టు కార్యకలాపాలు  కూడా ఇక్కడి నుంచి నిర్వహిస్తామన్నారు. తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణం దశలో ఉన్నందున సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హైకోర్టు కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపారు. జ్యూడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా ముందు పేర్కొన్నారు

ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ బుధవారం  రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేస్తాయని ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీకి 14 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తుల కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంది. ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. 

Trending News