ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు ; ఐపీఎస్ అధికారుల బదిలీ పిటిషన్ కొట్టివేత

                                  

Last Updated : Mar 29, 2019, 11:28 AM IST
ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు ; ఐపీఎస్ అధికారుల బదిలీ పిటిషన్ కొట్టివేత

ఐపీఎస్ అధికారుల బదిలీ కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీల బదిలీ బదిలీలను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయ స్థానం స్పష్టం చేసింది.దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది

అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవలే ఏపీ ఇంటెలిజెన్సీ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసింది. 

 ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వెంకటేశ్వరరావు సీఎం భద్రతను చూస్తారనీ ఎన్నికల నిర్వహణతో ఆయనకు సంబంధం లేదని పిటిషన్ లో పేర్కొంది. కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బదిలీ ఎలా చేస్తారని ప్రశ్నించింది. వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈసీకి  ఫిర్యాదులు చేసిందని టీడీపీ వాదించింది. 

ఇదే సమయంలో ఈసీ తమ వాదనలను వినిపించింది. ప్రతిపక్ష పార్టీ అభ్యంతరాల మేరకు బదిలీ చేశామని.. ఎన్నికల సజావుగా సాగేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నామని .. అయినా  బదిలీలు తాత్కాలికమేనని పేర్కొంటూ ..తన నిర్ణయాన్ని ఎన్నికల సంఘం సమర్ధించుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది

Trending News